అమ్స్టెల్విన్ (నెదర్లాండ్స్): టోక్యో ఒలింపిక్స్లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న ఇండియా విమెన్స్ హాకీ టీమ్... వరల్డ్ కప్ కోసం రెడీ అయ్యింది. ఆదివారం జరిగే పూల్–బి మ్యాచ్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. గత కొన్ని రోజులుగా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న ఇండియా టీమ్.. ఎఫ్ఐహెచ్ లీగ్లో మూడో ప్లేస్లో నిలిచింది. అలాగే మే నెలలో ఐఎఫ్హెచ్ ర్యాంకింగ్స్లో ఆరో ప్లేస్కు చేరుకోవడం కూడా కాన్ఫిడెన్స్ పెంచే అంశం. వీటన్నింటిని పక్కనబెడితే.. టోక్యో ఒలింపిక్స్లో పతకం ఆశలపై నీళ్లు చల్లిన ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది.
1974 వరల్డ్కప్లో నాలుగో ప్లేస్లో నిలిచిన ఇండియా తమ ప్లేస్ను మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. రాణి రాంపాల్ నుంచి కెప్టెన్సీ స్వీకరించిన గోల్ కీపర్ సవితా పూనియా అద్భుతంగా టీమ్ను నడిపిస్తుండటం కలిసొచ్చే అంశం. వైస్ కెప్టెన్ దీపా గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, ఉదిత, నిక్కీ ప్రధాన్, బిచు దేవి మంచి ఫామ్లో ఉన్నారు. గోల్స్ చేసే బాధ్యత వందన కటారియా, లాల్రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవిపై ఉంది. అయితే రాణి రాంపాల్ లేకపోవడం కాస్త లోటుగా కనిపిస్తున్నది. ఈ మ్యాచ్ తర్వాత ఇండియా.. చైనా (5న), న్యూజిలాండ్ (7న)తో తలపడుతుంది.