
- 15 రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్లు ట్యాప్
- 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్స్
- నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4,200 మంది ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు టీమ్
- అందులో కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ, ఇతర నేతలే 618 మంది
- మావోయిస్టు సానుభూతిపరులుగా సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ లిస్ట్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టురట్టు చేసిన సర్వీస్ ప్రొవైడర్లు
- సిట్కు చేరిన లిస్ట్లో పీసీసీ చీఫ్ సహా రాష్ట్రంలోని ముఖ్యనేతలు
హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు మొత్తం 618 మంది పొలిటీషియన్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే, అందరితో కలిపి మొత్తం 4,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని, మావోయిస్టు సానుభూతిపరుల నెపంతో ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు టీం అదే ఏడాది నవంబర్లో సర్వీస్ ప్రొవైడర్లకు లిస్ట్ పంపింది.
ఈ లిస్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో ఎస్ఐబీకి చేరింది. ఆయా నంబర్లు ట్యాపింగ్ లో ఉన్నట్లు సంబంధిత టెలికాం కంపెనీలు ఎస్ఐబీకి లిస్ట్ పంపించాయి. అప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన లిస్ట్ లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్లో కీలక నేతలు, బీజేపీ నేతలు, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు , వైఎస్ షర్మిల, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, ముఖ్య అనుచరులకు నంబర్లను సిట్ గుర్తించింది.
ఆయా నంబర్లకు ఫోన్లు చేసి సాక్షుల స్టేట్మెట్లు రికార్డు చేస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో ఏపీ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, కోటంగిరి వినయ్కుమార్ రెడ్డి లాంటి నేతలూ ఉన్నారు. లిస్ట్ ఆధారంగా ప్రతిరోజూ సగటున 10 మంది స్టేట్మెంట్లను సిట్ అధికారులు
రికార్డు చేస్తున్నారు.
సాక్షులుగా టీపీసీసీ చీఫ్ సహా 9 మంది స్టేట్ మెంట్లు
2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఒకరైన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సహా మొత్తం 9 మంది సాక్షులను మంగళవారం సిట్ విచారణ జరిపింది. మహేశ్గౌడ్తో పాటు గాంధీ భవన్కు చెందిన నలుగురు వర్కర్లు, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్, గద్వాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి వద్ద హాజరై.. సాక్షులుగా తమ వాంగ్మూలం ఇచ్చారు.
పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్సహా కీలక నేతల స్టేట్మెంట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ప్రణీత్రావు, ప్రభాకర్ రావు ఎంక్వైరీని సిట్ వాయిదా వేసింది. ప్రణీత్రావును బుధవారం, ప్రభాకర్ రావును గురువారం విచారణకు రావాలని సూచించింది.