
- స్టడీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- రైతు బీమా మరణాల్లో 50 శాతం అనారోగ్యంతోనే..
- అనుమతి లేని గ్లైఫోసెట్ వంటి కెమికల్స్ వాడకంపై ఆందోళన
- స్ప్రే టైంలో జాగ్రత్తలు పాటించక పోవడంవల్లేనంటున్న ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతుల ఆరోగ్యంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. పురుగు మందుల విచ్చలవిడి వాడకం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతు బీమా మరణాల్లోనూ 50 శాతానికి పైగా అనారోగ్యంతోనే సంభవిస్తుండటం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే పత్తి పంటలకు అనుమతి లేని గ్లైఫోసెట్ వంటి రసాయనాలు వాడుతున్నారు. గతంలో వెలువడిన ‘బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ’ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. రైతుల రక్త, మూత్ర నమూనాల్లో ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలింది.
రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందులు వినియోగించడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న రైతులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నది. భవిష్యత్తులో రైతుల ఆరోగ్యం విషయంలో ఒక పాలసీ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
493 మంది రైతులనుంచి శాంపిల్స్ సేకరణ..
రాష్ట్రంలో అన్నదాతల ఆరోగ్యంపై పెస్టిసైడ్ల ప్రభావం తీవ్రంగా ఉంది. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. ‘బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ’, ‘ఇండియా ఏ బ్రీఫ్ డాటా రిపోర్ట్’ పేరుతో రూపొందించిన అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ రీసెర్చ్ ఆర్టికల్ పై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల నుంచి 493 మంది రైతుల బ్లడ్, యూరిన్ శాంపిళ్లను సేకరించి, పరీక్షించారు.
ఈ శాంపిళ్లలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 11 రకాల పెస్టిసైడ్స్తో సహా మొత్తం 28 రకాల వేర్వేరు పురుగు మందుల అవశేషాలను కనుగొన్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. మరికొన్ని జిల్లాల్లోనూ రైతులకు రక్త, మూత్ర పరీక్షలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
అత్యంత ప్రమాదకర రసాయనాలు
రైతులు పంటలకు పిచికారీ చేస్తున్న అనేక పురుగు మందుల్లో చాలా ప్రమాదకరమైనవి ఉంటున్నాయి. ఇందులో కొన్ని అసలు అనుమతి లేనివి కాగా.. మరికొన్ని అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని స్ర్పే చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి వంటి ప్రధాన పంటలకు చీడపీడలు ఎక్కువగా ఆశిస్తుండటంతో రైతులు పురుగు మందులను విపరీతంగా వినియోగిస్తున్నారు. అలాగే, అనుమతి లేని గ్లైఫోసెట్ లాంటి రసాయనాలను కూడా ఇష్టానుసారంగా వాడుతున్నారు.
గ్లైఫోసెట్ అనేది గడ్డి మందు జాతికి చెందినది. అది నేలపై పడితే.. భూమి చుట్టుతా కొంతకాలనికి అక్కడ పంటలు పండే గుణం కూడా కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు. స్ప్రే చేసే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కు వంటి రక్షణ పరికరాలు ధరించకపోవడం వల్ల నేరుగా రైతుల శరీరంలోకి ఈ రసాయనాలు ప్రవేశిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కఠిన నిబంధనలు అమలు చేయాలి
పురుగు మందుల వాడకంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్లైఫోసెట్ లాంటి నిషేధిత కెమికల్స్పై పూర్తి నిషేధం విధించాలని, నకిలీ పురుగు మందుల తయారీ, విక్రయాలను అరికట్టాలని వారు కోరుతున్నారు. అలాగే, రైతులకు పురుగు మందుల సురక్షిత వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రక్షిత దుస్తులు, మాస్క్లను ఉచితంగా అందించాలని సూచిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను అమలు చేయడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదకరమైన రసాయనాల వాడకాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, భవిష్యత్తులో రైతుల ఆరోగ్యం మరింత క్షీణించి, అది వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
పురుగు మందుల అవశేషాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, నాడీ మండల సమస్యలు, సంతానలేమి, చర్మ వ్యాధులు వంటి పదుల సంఖ్యలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, దీనికి ప్రధాన కారణం ఈ రసాయనాల ప్రభావమేనని వారు అభిప్రాయపడుతున్నారు.
పురుగు మందుల వాడకంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే అన్నం పెట్టే అన్నదాతల జీవితాలు విషమయం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారని చెబుతున్నారు.