కేబినెట్ బెర్త్‪లపై ఉత్కంఠ : హైకమాండ్‪కు సీఎం రేవంత్ నలుగురి పేర్లు

కేబినెట్ బెర్త్‪లపై ఉత్కంఠ : హైకమాండ్‪కు సీఎం రేవంత్ నలుగురి పేర్లు
  • మరో రెండు పేర్లను ప్రపోజ్​ చేసిన భట్టి, వెంకట్​రెడ్డి
  • క్లారిటీతో రావాలని హైకమాండ్​ సూచన
  • శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు
  • నామినేటెడ్​ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత
  • నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్​విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్​ హైకమాండ్​తో సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం ఆరు కేబినెట్ ​బెర్త్​లు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా నాలుగింటి భర్తీపైనే దృష్టిపెట్టారు. హైకమాండ్​కు ​నలుగురి పేర్లతో సీఎం రేవంత్​లిస్టు ఇవ్వగా.. మరో రెండు పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రపోజ్​ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నలుగురి పేర్లతో రావాలని హైకమాండ్​ సూచించినట్లు తెలిసింది. మరోవైపు నాలుగు రాష్ట్రాలతో పాటే  తెలంగాణలోనూ పీసీసీ చీఫ్​ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పీసీసీ  కొత్త చీఫ్​ నియామకం మరింత లేట్​అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు హైకమాండ్​ గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఇక కాంగ్రెస్​ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్​ పోస్టులకు ఎంపిక బాధ్యతను హైకమాండ్​ సీఎం రేవంత్​కే అప్పగించింది.

మూడురోజులుగా ఢిల్లీలోనే

మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్​రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్​ విస్తరణ, నామినేటెడ్​ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్​ హైకమాండ్​తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంతోపాటు హైకమాండ్​ పెద్దలతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితర నేతలు ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ హైకమాండ్ అనుమతి కోరారు. 

ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఇందులో నాలుగు ఇప్పుడు భర్తీ చేసి, మరో రెండు పెండింగ్​లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. త్వరలో భర్తీ చేసే నాలుగింటిలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును.. ఎస్టీల్లో ఆదివాసీ కోటా కింద సీతక్క కేబినెట్​లో ఉండగా, లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరును.. రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్​లకు ఇచ్చిన మాట మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరును.. మైనార్టీ కోటాలో  షబ్బీర్ అలీ పేరును సీఎం ప్రపోజ్​ చేసినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. 

 కాగా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇస్తే బాగుంటుందని హైకమాండ్​కు సీఎం రేవంత్​రెడ్డి సంకేతాలు పంపినట్టు సమాచారం. ప్రేమ్​సాగర్​రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇక భువనగిరి ఎంపీ సీటును గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్​రెడ్డి పేరు పరిశీలించాలని కోమటిరెడ్డి వెంక టరెడ్డి హైకమాండ్​ను కోరినట్టు సమాచారం. శ్రావణ మాసంలో రాష్ట్ర కేబినెట్​ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్​ వర్గాలు భావిస్తున్నాయి. 

పీసీసీ చీఫ్​ నియామకం మరింత లేట్  

పీసీసీ కొత్త చీఫ్ నియామకానికి మరింత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. పీపీసీ చీఫ్​గా గురువారంతో రేవంత్ పదవీకాలం పూర్తికానుంది. కానీ, త్వరలో మరో 4 రాష్ట్రాలకు పీసీసీ చీఫ్​లను నియమించాల్సి ఉందని, వాటితోపాటే తెలంగాణకు కూడా నియమిస్తామని హైకమాండ్ స్పష్టం చేసింది. పీసీసీ చీఫ్​కు ఇప్పుడే తొందర ఏముందని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ అనడంతో ఢిల్లీలోనే మకాం వేసిన ఆశావహుల్లో నిరాశ అలుముకుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం సీఎం రేవంత్​కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిసింది. 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారిని, ఈ రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని, ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్లకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ రేవంత్​కు స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుకు వెళ్లాలని రేవంత్​కు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి సూచించినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి.