
- మరో రెండు పేర్లను ప్రపోజ్ చేసిన భట్టి, వెంకట్రెడ్డి
- క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన
- శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు
- నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత
- నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రస్తుతం ఆరు కేబినెట్ బెర్త్లు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా నాలుగింటి భర్తీపైనే దృష్టిపెట్టారు. హైకమాండ్కు నలుగురి పేర్లతో సీఎం రేవంత్లిస్టు ఇవ్వగా.. మరో రెండు పేర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి నలుగురి పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. మరోవైపు నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పీసీసీ కొత్త చీఫ్ నియామకం మరింత లేట్అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
ఇక కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టులకు ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్కే అప్పగించింది.
మూడురోజులుగా ఢిల్లీలోనే
మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంతోపాటు హైకమాండ్ పెద్దలతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితర నేతలు ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ హైకమాండ్ అనుమతి కోరారు.
ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఇందులో నాలుగు ఇప్పుడు భర్తీ చేసి, మరో రెండు పెండింగ్లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. త్వరలో భర్తీ చేసే నాలుగింటిలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును.. ఎస్టీల్లో ఆదివాసీ కోటా కింద సీతక్క కేబినెట్లో ఉండగా, లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరును.. రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్లకు ఇచ్చిన మాట మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరును.. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరును సీఎం ప్రపోజ్ చేసినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
కాగా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇస్తే బాగుంటుందని హైకమాండ్కు సీఎం రేవంత్రెడ్డి సంకేతాలు పంపినట్టు సమాచారం. ప్రేమ్సాగర్రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇక భువనగిరి ఎంపీ సీటును గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్రెడ్డి పేరు పరిశీలించాలని కోమటిరెడ్డి వెంక టరెడ్డి హైకమాండ్ను కోరినట్టు సమాచారం. శ్రావణ మాసంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
పీసీసీ చీఫ్ నియామకం మరింత లేట్
పీసీసీ కొత్త చీఫ్ నియామకానికి మరింత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. పీపీసీ చీఫ్గా గురువారంతో రేవంత్ పదవీకాలం పూర్తికానుంది. కానీ, త్వరలో మరో 4 రాష్ట్రాలకు పీసీసీ చీఫ్లను నియమించాల్సి ఉందని, వాటితోపాటే తెలంగాణకు కూడా నియమిస్తామని హైకమాండ్ స్పష్టం చేసింది. పీసీసీ చీఫ్కు ఇప్పుడే తొందర ఏముందని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ అనడంతో ఢిల్లీలోనే మకాం వేసిన ఆశావహుల్లో నిరాశ అలుముకుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం సీఎం రేవంత్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిసింది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారిని, ఈ రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిని, ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్లకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ రేవంత్కు స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుకు వెళ్లాలని రేవంత్కు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి సూచించినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి.