
హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలో తెలంగాణ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందని, ఇందుకు రూ.3.70 కోట్ల ఫైన్ వేయవచ్చని ఎక్స్పర్ట్ కమిటీ తేల్చిచెప్పింది. ఏపీలోని కడప జిల్లాకు చెందిన చంద్రమౌళేశ్వరరెడ్డి వేసిన పిటిషన్పై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సైంటిస్ట్ అరోకియా లెనిన్, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు సైంటిస్ట్ పూర్ణిమ, నీరి జోనల్ సైంటిస్ట్ షేక్ బాషా, మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు, సీడబ్ల్యూసీ(కేజీబీవో) డైరెక్టర్ రమేశ్కుమార్, కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఎల్బీ మౌనతంగ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ప్రాజెక్టు పనులు తనిఖీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ (ఎల్లూరు), ఏదుల పంపుహౌస్, టన్నెల్, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్లను తనిఖీ చేసి నివేదికను ఎన్జీటీకి శుక్రవారం సమర్పించారు. ఈఐఏ నోటిఫికేషన్, 2006లోని నిబంధనలను తెలంగాణ ఉల్లంఘించినట్టుగా స్పష్టమైందని రిపోర్టులో పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేశారని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా తవ్వి, బ్లాస్ట్ చేసిన మట్టి, రాళ్లను పలు ప్రాంతాల్లో భారీగా డంప్ చేశారని తెలిపారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.3,70,87,500లు పరిహారంగా చెల్లించాలని సిఫార్సు చేశారు.