- అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు ప్రభు ఎల్.పింగళి
- ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో మెగా కాన్వొకేషన్
హైదరాబాద్, వెలుగు: 1960లో ఆహార కొరతను ఎదుర్కొన్న భారతదేశం.. హరిత విప్లవం ద్వారా ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు, టాటా- కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రభు ఎల్.పింగళి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ గ్రౌండ్లో వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షత మెగా కాన్వొకేషన్ కార్యక్రమం జరిగింది.
దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభు మాట్లాడుతూ.. పప్పు ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని, దేశంలో పోషకాహార లోపానికి ఇదే కారణమన్నారు. సాగు పద్ధతులు, పంటల విధానాలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2,135 మంది యూజీ, 480 మంది పీజీ, 129 మంది పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ప్రభు పింగళికి వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
