- ప్రపంచంలో ఒకేఒక్కడుగా రికార్డు కొట్టేసిన విక్టర్ వెస్కోవో
- 40 కొత్త జీవజాతులను గుర్తించిన ‘ఫైవ్ డీప్స్ ఎక్స్పెడిషన్’ టీం
పిల్లవాగులను ఈదినోడికి సప్తసముద్రాలను ఈదడం కష్టమే కావొచ్చు. కానీ, ఆ సప్త సముద్రాలను ఈదినోళ్లకు ఆ పిల్లవాగులు ఓ లెక్కా! కాదు కదా! అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అలాంటి ఓ సాహసమే చేశాడు. భూమండలంపై ఉన్న అన్ని మహా సముద్రాల లోతును చూసేశాడు. ఐదు మహాసంద్రాల్లో అత్యంత లోతుకు డైవింగ్ చేశాడు. ఈ సాహసం చేసిన ‘ఒకేఒక్కడు’గా నిలిచి రికార్డు కొట్టేశాడు. అతడి పేరు విక్టర్ వెస్కోవో. ఐదు మహాసంద్రాల్లోని అత్యంత లోతైన ప్రాంతాలకు వెళ్లిన మొదటి వ్యక్తిగా గుర్తింపు సాధించాడు. 10 నెలల్లో పసిఫిక్, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసంద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసంద్రాల్లో లోతైన ప్రాంతాలను ఛేదించిన అతడు, రికార్డు సృష్టించాడు. చివరిగా ఆర్కిటిక్ మొలాయ్ ట్రెంచ్లో 5.5 కిలోమీటర్ల లోతుకు వెళ్లాడు. అంతేకాదు, అట్లాంటిక్లోని టైటానిక్ షిప్పు దగ్గరికీ వెళ్లాడు.
ఎందుకు..? ఎలా?
‘ఫైవ్ డీప్స్ ఎక్స్పెడిషన్’ పేరిట విక్టర్ ఓ టీంను రెడీ చేసుకున్నాడు. డైవింగ్ కోసం 12 టన్నుల డీప్ సీ వెహికల్ (డీఎస్వీ) లిమిటింగ్ ఫ్యాక్టర్ను వాడాడు. దాంతోపాటుగా సముద్రం లోపల ఏమున్నాయో తెలుసుకునేందుకు వీలుగా డీఎస్ఎస్వీ ప్రెజర్ డ్రాప్ అనే నేవీ సబ్మెరీన్ సాయం తీసుకున్నాడు. అయితే, ఇదేదో రికార్డుల కోసం కాకుండా, లోపల ఏముందో తెలుసుకుంటే మనిషి బతికేందుకు ఏదో ఒక విధంగా అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ డైవ్లు చేసినట్టు మాజీ నేవీ రిజర్విస్ట్ అయిన వెస్కోవో చెబుతున్నాడు. ప్రయాణంలో భాగంగా100 ల్యాండర్లను మోహరించారు. వాటిని సముద్రం అడుగు భాగంలో ఏమున్నాయో తెలుసుకునేలా డిజైన్ చేశారు. ఈ ప్రయాణంలో దాదాపు 40 కొత్త జీవజాతులను విక్టర్ టీం కనుగొంది. అక్కడి నుంచి నీటి నమూనాలు సేకరించారు. జీవజాతుల ఫొటోలు తీశారు. సముద్రం అడుగున నీటిలో ఉండే ఉప్పు శాతం, ఉష్ణోగ్రతల వంటివి తెలుసుకోవడానికి ఈ నీటి నమూనాలు ఉపయోగపడతాయని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ అలన్ జేమీసన్ తెలిపారు. డీఎస్ఎస్వీ ప్రెజర్ డ్రాప్, మహాసంద్రాల అడుగు భాగాన్ని మ్యాప్ చేసిందన్నారు. అది మ్యాప్ చేసిన ప్రాంతం దాదాపు 3 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇటలీ దేశంతో సమానమన్నారు. డీప్ సీ డైవింగ్కు కావాల్సిన టెక్నాలజీనీ విక్టర్ టీం ప్రపంచానికి పరిచయం చేసింది. దాదాపు 74 వేల కిలోమీటర్లు ప్రయాణించిన టీం, ఆగస్టు 24న జర్నీ ముగించింది. ఉత్తర, దక్షిణ ధ్రువాలకూ వెస్కోవో వెళ్లాడు. పర్వతాలూ ఎక్కేశాడు. ఇప్పుడు మహాసముద్రాల లోతునూ చూసేశాడు.
