- తునాతునకలైన పరికరాలు
- ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
ట్యాంక్ బండ్, వెలుగు: నెక్లెస్ రోడ్లోనిజలవిహార్లో ఉన్న ఆర్వో ప్లాంట్లో భారీ పేలుడు జరిగింది. నీటి సరఫరా కోసం ఉపయోగించే ప్లాంట్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ చోటుచేసుకోవడంతో అక్కడి పరికరాలు పూర్తిగా తునాతునకలయ్యాయి. ప్లాంట్ వద్ద పనిచేస్తున్న అప్పుల నాయుడు (45), అంజి (30), లక్ష్మణ్ (40)కు తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో అప్పలనాయుడు, అంజిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, లక్ష్మణ్ను సోమాజిగూడలోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. అప్పలనాయుడితోపాటు లక్ష్మణ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వేసవి కాలం కావడం వల్ల ఆర్వో ఫిల్టర్ కంప్రెషర్లో హై ప్రెషర్ రివర్స్ ఏర్పడటం వల్లే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్, లేక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గల అసలు కారణాలపై లోతైన విచారణ చేస్తున్నారు.
