- అగ్రికల్చర్ వర్సిటీ విచారణ
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ శాఖలో మరోసారి నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. బుధవారం పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా యూనివర్సిటీ విచారణ జరిపింది. వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో)గా పనిచేస్తున్న ఎం. రాధ.. 2005లో పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని తేలింది.
వర్సిటీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఎం. రాధ (తండ్రిపేరు: ఎం.రాజన్న)2003, -2005 మధ్య పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో వ్యవసాయ డిప్లొమా కోర్సు చదవలేదని, అదే కాలేజీలో చదివిన బి. దేవరాజ్ అనే వ్యక్తి సర్టిఫికెట్ను ఫోర్జరీ చేసి వ్యవసాయ శాఖలో ఏఈవో ఉద్యోగం పొందినట్లు గుర్తించింది. నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు యూనివర్సిటీ సూచించింది.
