- వ్యక్తి అరెస్ట్
బషీర్ బాగ్, - వెలుగు : స్వస్తిక్ బ్రాండ్ పేరిట కల్తీ కారం పొడి అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ బార్మేర్ జిల్లా లోహారా గ్రామానికి చెందిన రూపారామ్ ఖత్రీ గత కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అప్జల్ గంజ్ ప్రాతంలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం సరిగ్గా నడవకపోవడంతో అది మూసేసి, అధిక సంపాదన కోసం నకిలీ కారం విక్రయాలు ప్రారంభించాడు. దీనికోసం ఉస్మాన్ గంజ్ లోని తన ఇంట్లోనే కారం ఫ్లోర్ మిల్ , ప్యాకింగ్ , సీలింగ్ యంత్రాలు కొనుగోలు చేసి అమర్చాడు.
స్వస్తిక్ బ్రాండ్ కారం ప్యాకెట్లు స్థానికంగా ఏజెంట్ ల వద్ద నుంచి కొనుగోలు చేశాడు. మార్కెట్ లో తక్కువ నాణ్యత ఉన్న మర్చిని కొనుగోలు చేసేవాడు. ఇలాంటి మిరప నుంచి వచ్చిన కారం పౌడర్ కు విషపూరితమైన రసాయనాలు, రంగులు కలిపి నకిలీ కారం తయారు చేసి, బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నాడు. ఇతడి దందాపై పక్కా సమాచారమందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూపారామ్ ఖత్రీ ఇంటిపై దాడిచేశారు.
ఇంట్లో నిల్వ చేసిన 30 కిలోల తాలు మిర్చి పౌడర్ , రంగులు కలిపిన 35 కిలోల కల్తీ మర్చి పొడి, నకిలీ స్వాస్తిక్ బ్రాండ్ కవర్లు, ప్యాకింగ్ , సీలింగ్ యంత్రాలు, రంగులు, కాంటాలు, ఫ్లోర్ మిల్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
