
హైదరాబాద్, వెలుగు: అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న 8 మంది ఫేక్ డాక్టర్లను గుర్తించామని, వారిపై ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సిటీలోని బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు.. యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఐవీ ఫ్లూయిడ్స్ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నారు.
సమాచారం అందుకున్న టీజీఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరెంజ్ క్లినిక్ (ఎస్ కే. నగులమీరా), బీఎల్ఆర్ క్లినిక్ (డా. పి. సూర్యలత), నాని మినీ హాస్పిటల్ (కె. వెంకటేశ్), శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (వై. సూర్యనారాయణ), శ్రీ శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శివ శంకర్), బాలాజీ క్లినిక్ (చి. విట్టల్), నందుశ్వర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (శంకర్ గౌడ్), మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ (SK. మస్తాన్) సెంటర్లపై టీజీఎంసీ వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్, సభ్యుడు డా. విష్ణు బృందాలు దాడులు నిర్వహించాయి. అనంతరం నిందితులపై ఎన్ఎంసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే వాట్సప్ నంబర్ 91543 82727 ద్వారా తెలియచేయాలని ప్రజలను కోరారు.