సూర్యపేటలో దారుణం..మహిళ కళ్లల్లో కారం కొట్టి.. వివస్త్రను చేసి..

సూర్యపేటలో దారుణం..మహిళ కళ్లల్లో కారం కొట్టి.. వివస్త్రను చేసి..

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను మృతుని కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టారు. ఊళ్లో అందరూ చూస్తుండగా కళ్లల్లో కారం కొట్టి... వివస్త్రను చేసి ఊరేగించారు. సూర్యాపేట మండలం రాజునాయక్ తండాలో రెండు రోజుల క్రితం ఘటన జరిగింది. తండాకు చెందిన శంకర్ నాయక్  జూన్  13న హత్యకు గురయ్యాడు.  ఇదే ఊరికి చెందిన బాధితురాలు హత్య కేసులో నిందితురాలిగా అరెస్టయ్యారు. శంకర్ నాయక్  బంధువులతో ఆమెకు పాతకక్షలున్నాయి. కొద్దిరోజుల క్రితం బాధితురాలు బెయిలుపై విడుదలై సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. రాజునాయక్  తండాకు చెందిన బంధువొకరు శనివారం చనిపోవడంతో బాధిత మహిళ అక్కడికి వెళ్లింది. శంకర్ నాయక్  హత్య తర్వాత మొదటిసారి తండాకు వచ్చిన ఆమెను చూసి అతడి బంధువులు దాడి చేశారు. ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం పోసి, కర్రలతో కొట్టారు. నడిరోడ్డుపై గంట సేపు జరిగిన ఈ అమానుషాన్ని గ్రామస్థులెవరూ అడ్డుకోలేదు. చివరకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ... ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి వెళ్లింది. శాంతాబాయి ఆమెకు రక్షణ కల్పించింది. విషయం తెలిసి పోలీసులు తండాకు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సర్పంచి, గ్రామపెద్దలు చూస్తున్నా అడ్డుకోలేదని పోలీసులకు తెలిపింది బాధితురాలు.