V6 News

పొలం ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య

పొలం ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య
  • పొలం ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య
  •     మెదక్‌‌‌‌ జిల్లా తిమ్మాయిపల్లిలో ఘటన

వెల్దుర్తి, వెలుగు : నీటి తడులు అందక పొలం ఎండిపోవడంతో పెట్టుబడి కూడా రాదన్న మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలో మంగళవారం జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పొన్న సాయిబాబా (32) తనకు పది గుంటల పొలంతో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వేసవి కారణంగా ఓ బోరులో భూగర్భ జలాలు అడుగంటగా.. మరో బోరులో నీరు తక్కువగా వస్తోంది. 

దీంతో నీటి తడులు అందక పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతోంది. బోర్లు వేయడం, పంట సాగు పెట్టుబడి కోసం సుమారు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. చేతికొచ్చే దశలో పంట ఎండిపోతుండడంతో పెట్టుబడి కూడా రాదేమోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం తన పొలం వద్దే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.