
- పంటల మార్పిడి సదస్సుల్లో ఆఫీసర్లపై ప్రశ్నల వర్షం
- విత్తనాలు, మార్కెటింగ్, మద్దతు ధర మాటేంటంటున్న రైతులు
- కోతులు, నెమళ్లు, అడవి పందుల నుంచి రక్షణ ఎలా ?
- ఫలించని సర్కార్ వ్యూహం
యాదాద్రి, వెలుగు : పంటల మార్పిడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. వరికి బదులు పల్లి, నువ్వులు వంటి పప్పు దినుసులు సాగుచేయాలని, దీని వల్ల ఎక్కువ లాభం వస్తుందంటూ ఆఫీసర్లు చెబుతున్నా రైతులు ఒప్పుకోవడం లేదు. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే కోతులు, అడవి పందులు, నెమళ్ల నుంచి పంటను ఎలా కాపాడుకోవాలని, విత్తనాలు, మార్కెటింగ్, మద్దతు ధర మాటేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో కంటే పెరిగిన వరి
వడ్ల కొనుగోళ్ల నుంచి తప్పుకోవడం కోసం రైతులు వరి సాగు తగ్గించేలా చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది చేసిన నియంత్రిత సాగులో సన్నవడ్ల ప్రయోగం వికటించి, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. వరి సాగు తగ్గించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేసినా వినకుండా రైతులు గతంలో కంటే ఎక్కువే సాగు చేశారు. గత వానాకాలం సీజన్లో 2.02 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు, ఈ సారి 2.75 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీంతో తాజాగా పంటల మార్పిడి అంశాన్ని తెర మీదకు తెచ్చింది. వరి సాగును కనీసం 50 శాతం తగ్గించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆర్డర్స్ జారీ చేసింది. వరి సాగును తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్న సర్కార్ ఈ సారి కలెక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లను రంగంలోకి దించింది.
ఆఫీసర్లపై ప్రశ్నల వర్షం
పంటల మార్పిడిపై అగ్రికల్చర్ ఆఫీసర్లు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు యాదాద్రి జిల్లాలో క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించారు. వరిసాగును తగ్గించాలని రైతులకు సూచించారు. అందుకు ప్రత్యామ్నాయంగా పల్లి, పెసర, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయల పంటలు సాగు చేయాలని చెబుతున్నారు. ఆఫీసర్ల సూచనలు విన్న రైతులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘పంటల మార్పిడి గురించి చెబుతున్నారు సరే.. గ్రామాల్లో కోతులు, అడవి పందుల సంగతేంటి ?, మీరు చెప్పినట్టు పల్లి, నువ్వులు సాగు చేస్తే ఒక్క మొక్కా మిగలదు, పంటలకు నిత్యం కాపలా ఉండాలా ?’ అని ప్రశ్నిస్తున్నారు. వీటిని నిర్మూలించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సర్కార్ పర్మిషన్ ఇచ్చిందని ఆఫీసర్లు చెబుతున్నా రైతులు అంగీకరించడం లేదు.
విత్తనాలు, మార్కెటింగ్ ఎలా ?
వరి విత్తనాలను దగ్గర్లోని ఏ షాపులోనైనా కొనుక్కోవచ్చు. కానీ నువ్వులు, పల్లి, పొద్దుతిరుగుడు విత్తనాలు దొరకవంటూ రైతులు చెబుతున్నారు. కోతులు, అడవి పందుల బారిన పడకుండా పంటలను సాగు చేసినా, మార్కెంటింగ్ పరిస్థితి ఏంటి ? పంటలను మద్దతు ధరకు సర్కార్ కొంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పంటలను అమ్ముకునేందుకు భువనగిరి, జనగామ వంటి మార్కెట్లకు వెళ్లాలంటే ట్రాన్స్పోర్టు ఖర్చులు భారీగా అయ్యే అవకాశం ఉందంటున్నారు. గత రెండు సీజన్లలో కంది పండిస్తేనే, దానిని అమ్ముకునేందుకు నానాకష్టాలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వేస్తున్న ప్రశ్నలకు ఆఫీసర్ల వద్ద సమాధానాలు లేకపోవడంతో మరోసారి ఆలోచించి సాగు చేయాలని చెబుతున్నారు.
అడవి పందుల నిర్మూలనకు చర్యలు
రైతులు చెబుతున్నట్టుగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అడవి పందుల బెడద ఉంది. వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గ్రామ పంచాయతీల నుంచి తీర్మానం రాగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు పందులను నిర్మూలిస్తారు.
- అనురాధ, డీఏవో