వ్యవసాయ పంటలకు పగలంతా కరెంటు ఇవ్వాలని రైతుల ధర్నా

వ్యవసాయ పంటలకు పగలంతా కరెంటు ఇవ్వాలని రైతుల ధర్నా

మొగుళ్లపల్లి, వెలుగు: కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. వ్యవసాయ పంటలకు పగలంతా కరెంటు ఇవ్వాలంటూ జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు రాకపోకలను స్తంభింపజేశారు. దీంతో భారీగా ట్రాఫిక్​జాం అయ్యింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని, ఇలా అయితే పంటలు ఎలా పండించుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. పంటలు పండక, పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకుల్లో చలనం లేదని మండిపడ్డారు. రైతులను అరిగోస పెడుతున్న సీఎం కేసీఆర్​కు వారి ఉసురు తప్పక తగులుతుందన్నారు.

బిల్లుల పేరుతో కరెంట్ తరచూ నిలిపేయడంతో వేసిన వరి నాట్లు, నారుమడులు, మిర్చి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై రైతులు బైకులు అడ్డుగా పెట్టి.. కేసీఆర్ డౌన్​డౌన్.. కరెంట్​ ఆఫీసర్ల వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు పలు గ్రామాల రైతులు, కాంగ్రెస్ లీడర్లు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళనతో పరకాల, జమ్మికుంట, భూపాలపల్లి వైపు వెళ్లే దారుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుమన్, ఆర్ఐ సురేందర్ రెడ్డి అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. సక్రమంగా కరెంట్​ ఇచ్చేలా చూస్తామని తహసీల్దార్​ హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.