బీసీలకు రూ.లక్ష.. కొన్ని కులాలకేనా

బీసీలకు రూ.లక్ష.. కొన్ని కులాలకేనా
  • బీసీలకు రూ.లక్ష.. కొన్ని కులాలకేనా
  • మెమోలో 14 కులాలు, ఎంబీసీని మాత్రమే మెన్షన్​ చేసిన సర్కారు
  • పద్మశాలి, గౌడ, ముదిరాజ్, గొల్ల, కురుమ, మున్నూరుకాపు తదితర కులాల ప్రస్తావనే లేదు
  • దరఖాస్తు కోసం మీసేవకు వెళ్తే.. కొన్ని క్యాస్ట్​లకేనని సమాధానం
  • రెండు రోజులుగా అప్లికేషన్​ 
  • సర్వర్​ డౌన్​.. ఇచ్చిన రెండు వారాల గడువులో రెండు రోజులు వేస్ట్​
  • స్కీమ్​లో  ఎన్నో కండిషన్లు పెట్టిన ప్రభుత్వం 
  • ఇతర స్కీమ్​ల ద్వారా 50 వేలకు పైబడి లబ్ధిపొందినవాళ్లు అనర్హులు
  • అయితే.. కల్యాణలక్ష్మికి మాత్రం మినహాయింపు
  • ఇన్​కమ్​ సర్టిఫికెట్​ తప్పనిసరి 

హైదరాబాద్, వెలుగు: బీసీ కులవృత్తులవాళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీసీల్లోని అందరికీ దీన్ని వర్తింపజేస్తుందా? అనేదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. అప్లికేషన్లు మొదలుపెట్టినా దీనిపై కన్ఫ్యూజన్​ కొనసాగుతూనే ఉంది. మొదట ఇచ్చిన జీవోలో ‘ఆల్​ ద బ్యాక్​వర్డ్​ క్లాసెస్​ ఆర్టిజన్స్​, వొకేషనల్​ కమ్యూనిటీస్’ అని పేర్కొన్న ప్రభుత్వం.. ఆ తర్వాత విడుదల చేసిన మెమోలో మాత్రం ప్రత్యేకంగా 14 కులాలు, ఎంబీసీలు అర్హులని ప్రస్తావించింది. అప్లయ్​ చేసుకునేందుకు  ఎవరైనా మీసేవ సెంటర్​కు వెళ్తే అక్కడి సిబ్బంది.. బీసీల్లోని కొన్ని కులాలకే స్కీమ్​ వర్తిస్తుందని బదులిస్తున్నారు. 

అప్లయ్​కి రెండు వారాలే

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సర్కారు ఊరూరా సంబురాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా  శుక్రవారం సంక్షేమ సంబురాలను నిర్వహించనున్నది. అదే రోజున సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా బీసీ కులవృత్తుల వాళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం స్కీమును ప్రారంభించనున్నారు. అయితే, ఈ స్కీములో లబ్ధిదారులకు సర్కారు మెలికలు పెట్టింది.

స్కీము కోసం అప్లై చేసుకోవడానికి గడువును కేవలం రెండు వారాలే పెట్టిన ప్రభుత్వం.. గత ఐదేండ్లలో ఎవరైనా రూ. 50 వేలకుపైబడిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకుని ఉంటే అనర్హులని జీవోలో పేర్కొంది. బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్​లో కలెక్టర్లు పలు సందేహాలు వ్యక్తం చేయగా.. అదే రోజు ఓ మెమోను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. అందులో లబ్ధిదారులుగా కేవలం కొన్ని కులాలనే మెన్షన్​ చేయడం మరింత సందేహాలకు తావిస్తున్నది. కల్యాణలక్ష్మి లబ్ధిదారులూ పథకానికి అర్హులేనని మెమోలో పేర్కొన్నారు. అయితే.. రైతుబంధు, గొర్ల స్కీముల్లో లబ్ధిపొందిన వాళ్లకు దీన్ని ఇస్తరా? ఇవ్వరా? అన్నది మెన్షన్​ చేయలేదు. ఇదిలా ఉంటే.. కండిషన్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దళితబంధు పథకానికి దళితుల్లో ఎవరైనా అర్హులేనని అప్పట్లో స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నోళ్లూ అప్లై చేసుకోవచ్చని క్లియర్​గా చెప్పారు. బీసీలకు రూ.లక్ష సాయానికి మాత్రం  ఇన్​కమ్​ సర్టిఫికెట్ తప్పనిసరని, రూ. 50 వేలకుపైబడిన ఇతర పథకాలు తీసుకున్నోళ్లు అర్హులు కారని పేర్కొనడం విమర్శలకు తావిస్తున్నది.  

జీవో అట్ల.. మెమో ఇట్ల

నాయీ బ్రాహ్మణులు, రజకులు, సగర, ఉప్పర, కుమ్మరి/శాలివాహన, అవుసల, కంసాలి, కమ్మరి, కంచారి, వడ్ల/వడ్ర/వడ్రంగి/శిల్పి, కృష్ణ బలిజ/పూసల, మేదర, వడ్డెర, ఆరెకటిక, మేర, ఎంబీసీ వంటి కులాలవాళ్లు అర్హులవుతారని మెమోలో ప్రభుత్వం ప్రత్యకంగా పేర్కొంది. బీసీల్లోని ముఖ్యంగా 14 కులాలతో పాటు ఎంబీసీని అందులో మెన్షన్​ చేసింది. పద్మశాలి, గౌడ, యాదవ, కురుమ, గొల్ల, ముదిరాజ్​, మున్నూరుకాపు, వాల్మీకిబోయ, తదితర కులాల ప్రస్తావనే మెమోలో లేదు. వీళ్లకు వర్తింపజేస్తరా లేదా అనేది చెప్పలేదు. వీళ్లలో ఎవరైనా అప్లై చేసుకునేందుకు మీ సేవా సెంటర్లకు వెళ్తే.. కొన్ని కులాలకు మాత్రమే అవకాశం ఉందంటూ అక్కడివాళ్లు చెప్తున్నారు. మొదట విడుదల చేసిన జీవోలోనేమో ‘ఆల్​ ద బ్యాక్​వర్డ్​ క్లాసెస్​ ఆర్టిసన్స్​, వొకేషనల్​ కమ్యూనిటీస్​’కు లబ్ధి కలుగుతుందని పేర్కొన్పటికీ.. తెల్లారి ఇచ్చిన మెమోలో ‘ఆల్​ ద బ్యాక్​వర్డ్​ క్లాసెస్​ ఆర్టిజన్స్​, వొకేషనల్​ కమ్యూనిటీస్​’కు అని చెప్తూనే  కొన్ని కులాలను విడిగా ప్రస్తావించడంపై  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

మున్సిపల్​ ఆఫీసులో కాపీ ఇవ్వాల్నట..

ఆన్​లైన్​లోనే పారదర్శకంగా దరఖాస్తులను తీసుకుంటామని సర్కారు అప్లికేషన్లను ప్రారంభించిన రోజు (ఈ నెల 6న) ప్రకటించింది. కానీ, అప్లికేషన్​ పూర్తయిన తర్వాత ఆ ఫారాన్ని సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపాలిటీల్లో సబ్​మిట్​ చేయాలని చెప్తున్నారు. మరోవైపు తొలిరోజు అప్లికేషన్ల స్వీకరణ సజావుగానే సాగినా.. ఆ తర్వాతి రోజు నుంచి మొరాయించడం మొదలుపెట్టింది. దరఖాస్తు నింపేంత వరకు అంతా సజావుగానే సాగినా.. చివర్లో సబ్​మిట్​ చేశాక దాన్ని తీసుకోవడం లేదు. గంట సేపటిదాకా వేచి చూసినా ప్రయోజనం ఉండడం లేదు. ఈ నెల 20 (కేవలం రెండు వారాల) వరకే గడువు విధించడం.. ఇంత తక్కువ గడువులోనూ రెండు రోజులు సర్వర్​ సతాయించి అప్లికేషన్లు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా  సర్వర్​ మొరాయిస్తున్నా.. సర్వర్​ సమస్యను మాత్రం ప్రభుత్వం పరిష్కరించలేదు. శుక్రవారం వరకు సర్వర్​ బాగవుతుందని అధికారులు అంటున్నారు.

అప్లికేషన్​ ఫారంలో ‘బీసీ- సీ, ఈ’ ఎత్తివేత 

అప్లికేషన్​ ఫారంలో బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-డీ సబ్​ క్యాస్ట్​లు కనిపిస్తున్నా.. బీసీ-సీ, బీసీ-ఈ మాత్రం లేవు. బీసీ-సీ సబ్​ క్యాస్ట్​లలో.. ఎస్సీల నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్​ అయినవాళ్లు ఉంటారు. బీసీ-ఈలో ముస్లింలలోని వివిధ కమ్యూనిటీలకు చెందిన వాళ్లు ఉంటారు. బీసీ -సీ, బీసీ-ఈల్లోనూ కుల వృత్తులు, చేతివృత్తులు చేసుకుంటూ జీవనం సాగించే పేదవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ, ఈ రెండువర్గాల ప్రస్తావన మాత్రం రూ. లక్ష స్కీమ్​ అప్లికేషన్​ ఫారంలో లేదు.