
హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్టుగా ఈ కేసులో పూరన్ కుమార్ భార్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదుకావడం కొత్త ట్విస్టుకు దారి తీసింది. హర్యానా పోలీసు అధికారి, ఏఎస్ఐ సంజయ్ లాథర్ ఆత్మహత్య కేసులో ఈ నలుగురిపై రోహతక్ పోలీస్ స్టేషన్ లో బుధవారం (అక్టోబర్ 15) కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
ఈ కేసులో పూరన్ కుమార్ భార్య పి.అవనీత్ కౌర్, గన్ మన్ సుశీల్, బతిండ రూరల్ ఎమ్మెల్యే అమిత్ రత్నాతో పాటు మరొక వ్యక్తిపై కేసు నమోదైంది. నిందితులపై నమోదైన ఆరోపణలను, ఎఫ్ఐఆర్ కాపీని బహిర్గతం చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే వివరాలు బయటపెడతామని పోలీసులు తెలిపారు.
పూరన్ కుమార్ ఆత్మహత్య తర్వాత మరో పోలీసు అధికారి సంజయ్ లాథర్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. చనిపోయిన సీనియర్ తెలుగు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తన ఆత్మహత్యకు కారణమని మూడు పేజీల లేఖలో ఈ పోలీసు అధికారి ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పూరన్ కుమార్పై అవినీతి ఆరోపణల కేసును విచారిస్తున్న పోలీసులలో సందీప్ కుమార్ కూడా ఒకరు. నిజాన్ని బతికించడం కోసం తన జీవితాన్ని పణంగా పెడుతున్నట్లు నోట్లో సందీప్ కుమార్ రాయడం గమనార్హం. పూరన్ కుమార్ తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో చచ్చిపోయాడని సందీప్ రాసుకొచ్చాడు. పూరన్ కుమార్ భారీ అవినీతికి పాల్పడ్డాడని, అతనిపై ఫిర్యాదు చేస్తారేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని సందీప్ కుమార్ చేసిన ఆరోపణలు పూరన్ కుమార్ ఆత్మహత్య కేసును కొత్త మలుపు తిప్పాయి.
హర్యానాలో సీనియర్ ఐపీఎస్, జైళ్ల శాఖ ఐజీగా బాధ్యతలు నిర్వహించిన దళిత ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్నా కుల వివక్ష తప్పలేదని, తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించే ప్రయత్నం చేయడంతోనే తాను చనిపోతున్నట్లు పూరన్ కుమార్ రాసిన సూసైడ్ లేఖతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2020లో తాను కుటుంబంతో కలిసి అంబాలా ఆలయాన్ని సందర్శించిన తర్వాతి నుంచే తనపై వేధింపులు మొదలయ్యాయని పూరన్ కుమార్ తెలిపారు. మానసికంగా తనను తీవ్రంగా వేధించారని, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా మరణానికి చేరువైన తండ్రిని చూసి రావడానికి సెలవు అడిగినా ఇవ్వలేదని, అధికారుల కక్ష సాధింపు కారణంగా తన తండ్రి చివరి క్షణాలలో ఆయన చెంత ఉండలేదని పూరన్ వాపోయారు. ఈ విషయాలన్నీ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించినా ప్రయోజనం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు.
తప్పుడు ఆరోపణలతో తనను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయడం, ప్రభుత్వ వాహనం ఇవ్వకుండా, పోలీసు భద్రతను తొలగించి.. ఇలా అన్ని రకాలుగా తనను వేధించారని చెప్పారు. ఇటీవల తన పేరు చెప్పి తన సబార్డినేట్ లంచం డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ తననూ కేసులో ఇరికించారని పూరన్ వాపోయారు. ఈ ఆరోపణలను సాకుగా తనను జైళ్ల శాఖకు బదిలీ చేయడంతో విసిగిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నానని పూరన్ తన లేఖలో చెప్పారు. హర్యానా డీజీపీ సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు తనను వేధించారని, పలువురు రిటైర్డ్ ఐపీఎస్ ల హస్తం కూడా ఇందులో ఉందని పూరన్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.