తొలి రోజు ముగిసిన ఆట..ఆసీస్ దే ఆధిపత్యం

తొలి రోజు ముగిసిన ఆట..ఆసీస్ దే ఆధిపత్యం

ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా పట్టు భిగిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ చేతిలో ఖంగుతిన్న ఆసీస్..మూడో టెస్టులో తొలి రోజే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు విలవిల్లాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్..33.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్..18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయగా.. కోహ్లీ 52 బంతుల్లో 2 ఫోర్లతో 22 రన్స్ సాధించాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నేమన్ 5  వికెట్లు తీసుకున్నాడు. నాథన్ లియోన్ 3 వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీకి ఒక వికెట్ దక్కింది. 

ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 12 పరుగులకే ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔటైనా...మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 147 బంతుల్లో 4 ఫోర్లతో 60 పరుగులు సాధించాడు. ఇతనికి తోడుగా  లబుషేన్ 91 బంతుల్లో ఫోర్‌తో 31 పరుగులు, స్టీవ్ స్మిత్ 38 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులతో సహకరించారు. ప్రస్తుతం క్రీజులో పీటర్ హ్యాండ్‌ కొంబ్(7), కామెరూన్ గ్రీన్(6) పరుగులతో  ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడు.  ప్రస్తుతం ఆస్ట్రేలియా 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.