పాకెట్ మనీతో ఖడ్గమృగం దత్తత..రూ.30 వేల విరాళం ఇచ్చిన చిన్నారులు

పాకెట్ మనీతో ఖడ్గమృగం దత్తత..రూ.30 వేల విరాళం ఇచ్చిన చిన్నారులు

ఓల్డ్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నూర్ ఖాన్ బజార్​లోని ఫోకస్ హైస్కూల్ విద్యార్థులు తమ పాకెట్​మనీతో నెహ్రూ జూపార్క్​లో ఖడ్గమృగాన్ని దత్తత తీసుకున్నారు. శుక్రవారం జూపార్క్​ను సందర్శించిన విద్యార్థులు.. స్కూల్ ప్రిన్సిపాల్, స్టాఫ్​తో కలిసి జంతు సంరక్షణ కోసం రూ.30 వేల చెక్కును జూ క్యూరేటర్ జె. వసంతకు అందజేశారు. మూడు నెలల పాటు ఈ ఖడ్గమృగం పోషణకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా క్యూరేటర్ జె. వసంత మాట్లాడుతూ.. చిన్న వయసులోనే వన్యప్రాణుల సంరక్షణ, బ్రీడింగ్ పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవడం గొప్ప విషయమన్నారు. తమ పాకెట్ మనీని ఇలా మంచి పనికి వినియోగించడం అభినందనీయమనికొనియాడారు. పౌరులు, కార్పొరేట్ కంపెనీలు సైతం జంతు దత్తతకు ముందుకు రావాలని  విజ్ఞప్తి చేశారు.