హరీశ్​ వద్దకు నర్సాపూర్​ పంచాయితీ

హరీశ్​ వద్దకు నర్సాపూర్​ పంచాయితీ
  • మదన్​ రెడ్డికే టికెట్​ ఇవ్వాలని మంత్రి ఇంటివద్ద అనుచరుల ఆందోళన

హైదరాబాద్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు : నర్సాపూర్​ టికెట్ ​సిట్టింగ్ ​ఎమ్మెల్యే మదన్ ​రెడ్డికే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్​ కోకాపేటలోని మంత్రి హరీశ్ ​రావు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. మెదక్​జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మెదక్  టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కేటాయించిన పార్టీ హైకమాండ్, నర్సాపూర్ టికెట్​ను పెండింగ్​లో పెట్టింది. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్​ మన్సూర్, నరాపూర్​ టౌన్, రూరల్, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి, చిలప్​చెడ్, కొల్చారం, వెల్దుర్తి మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నాయకులు మంత్రి ఇంటికి వెళ్లారు. ఆయనకు టికెట్​ఇవ్వకుంటే పార్టీ ఓడిపోతుందని, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్​ఇవ్వొద్దని డిమాండ్ ​చేశారు. కాగా, విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.