- పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాడికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు
- నాలుగేండ్లు సహజీవనం..ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణ
- పంజాగుట్ట పీఎస్లో కేసు
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లు సహజీవనం చేసి కాంతారావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా 69,351(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు ప్రకారం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి(22), హైదరాబాద్ సోమాజిగూడ దుర్గా నగర్ కాలనీలో విమెన్స్ హాస్టల్ లో నివసిస్తూ ఓ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తోంది.
ఆమె 2022లో ఇంటర్వ్యూ కోసం రేగా కాంతారావును కలిసింది. ఆ పరిచయంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై కాంతారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత అమీర్పేట్లోని నటుడు సంతోష్కు చెందిన ఫ్లాట్లో ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. రేగా కాంతారావు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా అదే ఫ్లాట్లో ఉండేవారు. తన వద్ద పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బు రెట్టింపు చేసి ఇస్తానని కాంతారావు నమ్మించి తన వద్ద రూ.4 లక్షలు వరకు తీసుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
స్నేహితురాలితో సంబంధం
2024 మే నెలలో రేగా కాంతారావు యువతికి తెలియకుండా ఆమె సెల్ఫోన్ నుంచి స్నేహితురాలి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. యువతి ఫ్రెండ్ తోనూ రేగా మాట్లాడటం, కలవడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు రేగాను కలవడం మానేసింది. దాంతో కోపం పెంచుకున్న రేగా తన ప్రైవేట్ ఫొటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. రేగా సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకునే ప్రవీణ్ అనే వ్యక్తి సాయంతో తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును పొందినట్లు తెలిపింది.
మార్చి 16న రూ. 5 లక్షలు, 18న రూ. 3.5 లక్షలను రేగా బదిలీ చేయించాడని వివరించింది. అయితే, అంతకుముందే బాధితురాలు ఆన్లైన్ ద్వారా 'షీ టీమ్'కు ఫిర్యాదు చేసింది. రేగా కాంతారావు వద్ద పెట్టుబడి పెట్టిన అసలు తిరిగి వచ్చిందని ఫిర్యాదులో తెలిపింది. కానీ ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడి చేయడంతో పాటు అబద్ధపు హామీలతో మోసం చేసినందున తగిన చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరింది.
