- గ్రీన్ క్యాంపస్ల ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణం
- డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి
- సస్టైనబుల్ క్యాంపస్ ఇంపాక్ట్ సమ్మిట్, అవార్డుల ప్రదానోత్సవం
గచ్చిబౌలి, వెలుగు : పర్యావరణ పరిరక్షణను ప్రతి విద్యాసంస్థ బాధ్యతగా తీసుకుని ముందుకు పోవాలని డీఆర్డీవో మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీశ్రెడ్డి సూచించారు. రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్శాంతి సరోవర్ గ్లోబల్పీస్ఆడిటోరియంలో భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ క్యాంపస్ ఇంపాక్ట్ సమ్మిట్, అవార్డ్స్ 2026 కార్యక్రమం నిర్వహించారు.
దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రముఖులు, పర్యావరణ నిపుణులు, విద్యార్థులు హాజరుకాగా, సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా సమ్మిట్ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. గ్రీన్ క్యాంపస్ల ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణం అందించవచ్చన్నారు. విద్యా సంస్థలు పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని సూచించారు.
ప్రకృతి పరిరక్షణతో పాటు అభివృద్ధి కూడా సమాంతరంగా సాగాలన్నారు. లోక్సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ పరస్పర విరుద్ధాలు కావన్నారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలన్నారు. అనంతరం విశిష్ట సేవలందించిన విద్యాసంస్థలకు అవార్డులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అండ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర కుక్కడపు, మాజీ ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టి.జి. సీతారాం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, లేబర్ అండ్ఎంప్లాయ్మెంట్సెక్రటరీ హరి చందన పాల్గొన్నారు.
