- హకీమ్ సాబ్ ఇకలేడు
- మాజీ ఫుట్బాలర్, హైదరాబాదీ హకీమ్ మృతి
- ప్లేయర్, కోచ్, రిఫరీగా ఇండియన్ ఫుట్బాల్కు సేవ
హైదరాబాద్, వెలుగు: ఇండియా మాజీ ఫుట్బాలర్, నేషనల్ టీమ్ మాజీ కోచ్ సయ్యద్ షాహిద్ హకీమ్ ఇకలేడు. హైదరాబాద్ నుంచి నేషనల్ టీమ్కు ఆడిన, ఇండియా ఫుట్బాల్ గోల్డెన్ ఎరాలోని ప్లేయర్లలో ఒకడైన 82 ఏళ్ల హకీమ్.. గుల్బర్గాలోని ఓ హాస్పిటల్లో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ‘రెండో రోజుల కిందట గుండెపోటు వచ్చినప్పటి నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు మరోసారి స్ట్రోక్వచ్చింది. 8.30కి మృతి చెందారు’ అని హకీమ్ భార్య సాదియా సయెదా తెలిపారు. గతేడాది కొవిడ్ బారిన పడిన హకీమ్.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. ఆగస్టు 15న హైదరాబాద్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. లెజెండరీ ఫుట్బాల్ కోచ్ ఎస్.ఎ. రహీమ్ కుమారుడైన హకీమ్.. 1960 రోమ్ ఒలింపిక్స్లో ఇండియా టీమ్కు ప్రాతినిధ్యం వహించారు. హకీమ్ సాబ్గా సుపరిచితుడైన ఈ హైదరాబాదీకి ఇండియన్ ఫుట్బాల్తో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ప్రతిష్టాత్మక ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న రెండో ఫుట్బాలర్ ఆయనే కావడం విశేషం. 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో హకీమ్.. క్లబ్ లెవెల్లో హైదరాబాద్ సిటీ కాలేజ్ ఓల్ట్ బాయ్స్ టీమ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్స్కు ఆడారు. డొమెస్టిక్ లెవెల్లో సర్వీసెస్కు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కోచ్గా మారి.. నేషనల్ టీమ్కు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు. పలు క్లబ్స్కు కూడా కోచింగ్ ఇచ్చిన హకీమ్.. ఫిఫా క్వాలిఫైడ్ రిఫరీగా కూడా పని చేశారు. 1988 ఏషియన్ కప్ సహా 33 ఇంటర్నేషనల్ మ్యాచ్లకు అఫీషియల్గా వ్యవహరించారు. హకీమ్ మృతి పట్ల ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఫ్రఫుల్ పటేల్, జనరల్ సెక్రటరీ కుశాల్ దాస్, ఇండియా మాజీ కెప్టెన్లు విక్టర్ అమల్రాజ్, షబ్బీర్ అలీ, తెలంగాణ ఫుట్బాల్ సంఘం సెక్రటరీ జీ.పి. పల్గుణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.