వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం : సీహెచ్ విద్యాసాగర్ రావు

వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం : సీహెచ్ విద్యాసాగర్ రావు

స్వామి వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గీతా విద్యాలయం మైదానంలో 2వ రోజు ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీహెచ్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు. ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా గౌరీజీ యువ పురస్కార్ అవార్డు ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఏబీవీపీ తెలంగాణ శాఖ 2004 నుండి సామాజిక సేవా రంగంలో కృషి చేసిన 45 సంవత్సరాల లోపు యువతకు గౌరీజీ యువ పురస్కార్ అవార్డు ప్రదానం చేస్తోంది. అవార్డు కింద రూ.25 వేల నగదుతో పాటు ప్రశంశ పత్రాన్ని అందజేస్తారు. ఈ ఏడాది హైదరాబాద్ కు చెందిన శ్రావ్యారెడ్డికి  గౌరీజీ యువ పురస్కార్ అవార్డు అందజేశారు. స్వర్గీయ జన మంచి గౌరీ శంకర్..ఏబీవీపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నుండి జాతీయ కార్యదర్శి వరకు బాధ్యతలు నిర్వహించారు. 

సేవా కార్యక్రమాల్లో ముందంజ
వీ అండ్ షీ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఒంటరి మహిళల్లో ఆత్మవిశ్వాసం కల్పించి..వారికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులో గత కొన్ని సంవత్సరాలుగా శ్రావ్యారెడ్డి కృషి చేస్తున్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు, మురికివాడల్లో ఉండే ప్రజలకు ఆహారాన్ని అందజేయడమే కాకుండా ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఆమె సేవలకు పలు సంస్థలు అవార్డులు అందజేశాయి. గౌరీజీ యువ పురస్కారాన్ని శ్రావ్యారెడ్డి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేతులమీదుగా అందుకున్నారు. 

50 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో లా కళాశాల అధ్యక్షునిగా పని చేశానని విద్యాసాగర్ రావు చెప్పారు. తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న విధంగా ఏబీవీపీ తనకు తల్లీ లాంటిదని అన్నారు. మార్పు అనేది సహజమని, మార్పు సమాజంలో జరగకపోతే మృత్యువుతో సమానం అని తెలిపారు. వ్యక్తులు కూడా సమాజానికి అనుగుణంగా మార్పు చెందాలన్నారు. నేటి యువత.. భవిష్యత్ భవిత అని, దేశ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకమని చెప్పారు. నరేంద్ర మోడీ RSS కార్యకర్తగా జీవితం ప్రారంభించి..ఇవాళ ప్రధానమంత్రి వరకు వెళ్లారని చెప్పారు. సాధించాలనే తపన, ధ్యేయం, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నారు. 

దేశంలో కమ్యూనిజం, క్యాపిటలిజం పూర్తిగా విఫలమయ్యాయని, ఈ దేశానికి సనాతన ధర్మమే శరణ్యమని విద్యాసాగర్ రావు అన్నారు. వివేకానంద ఆలోచన విధానమే ఈ దేశానికి మార్గదర్శకం అని చెప్పారు. భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడే ఆలోచన విధానాన్ని మానుకోవాలన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం G-21 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోందని, ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. G21 సదస్సులో భారత్ వసుదైక కుటుంబం, సర్వమత సమ భావన అనే భారతీయ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కలుగుతుందన్నారు. 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన సమయంలో స్వేచ్ఛ, సమానత్వంతో పాటుగా, సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చారని విద్యాసాగర్ రావు చెప్పారు. అంబేద్కర్ విగ్రహాలను స్టాచ్యూ ఆఫ్ ఫ్రాటర్నిటీ (సౌభ్రాతృత్వ ప్రతిమ)గా పిలవాలని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కూడా స్టాచ్యూ ఆఫ్ ఫ్రాటర్నిటీ అని పిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కోరుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరీజీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రావ్య రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జానారెడ్డి, ఝాన్సీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీజీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రావ్య రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జానారెడ్డి, ఝాన్సీ పాల్గొన్నారు.