- మూడు సార్లు చార్మినార్,ఒకసారి యాకత్పుర నుంచి ఎన్నిక
- 2023 నుంచి ఎంఐఎం జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న ఖాద్రీ
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(72) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సలాహుద్దీన్ ఓవైసీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఖాద్రీ.., మజ్లిస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పార్టీ నెట్వర్క్ను బలోపేతం చేయడంలో ఆయనది ముఖ్యపాత్ర. 2004, 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చార్మినార్, యాకత్పుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
అంతకు ముందు 1986 నుంచి 1991 వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్)లో కార్పొరేటర్గా పనిచేశారు. గత 2008 నుంచి మజ్లిస్ పార్టీ జనరల్ సెక్రటరీగా సంస్థాగత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మజ్లీస్ పార్టీకి, ఓల్డ్ సిటీకీ ఆయన సుదీర్ఘకాలంగా సేవలు అందించారు. ప్రజాకర్షణగల రాజకీయ నేతగా ఆయన పేరు సంపాదించారు. పాషా ఖాద్రీ రెండేండ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
గత ఏడాది నవంబర్ 30న ఖాద్రీ ఆరోగ్యం క్షీణించడంతో సంతోష్నగర్లోని ఓవైసీ హాస్పిటల్లో చేరి చికిత్స పొందారు. ఖాద్రీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలోనే మంగళవారం పాషా ఖాద్రీ మృతి చెందారు. ఆయన మృతికి మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఆపార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
