పోటీ చేయాలంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్రు.. సైదిరెడ్డి ఆడియో వైరల్

పోటీ చేయాలంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్రు.. సైదిరెడ్డి ఆడియో వైరల్

బీఆర్ఎస్ లో పోటీ అంటేనే నేతలు భయపడి పోతున్నారని... ఆర్ధిక బలం ఉన్న రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డిలు కూడా వెనకడుగు వేశారన్నారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.  రెండు రోజుల క్రితం కారు దిగి కమలం తీర్థం పుచ్చుకున్న సైదిరెడ్డి తన అనుచరులతో మాట్లాడిన ఓ ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఢిల్లీ నుంచి హఠాత్తుగా బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.. నల్గొండ ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తే కండువా కప్పుకున్నా. మీకు తెలియకుండా పార్టీ మారినందుకు క్షమించండి... మీరంతా తననున నమ్ముకుని పనిచేయండని టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తన అనుచరులను సైదిరెడ్డి కోరారు.. రెండు రోజుల్లో మిమ్మల్ని కలుస్తానని ... భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఆయన చెప్పారు.  తెలంగాణలో మోడీ గాలి వీస్తుంది...10 నుంచి 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలుస్తుందన్నారు.

కేంద్రంలో మళ్ళీ బీజేపీదే అధికారమని .. మోడీనే మళ్ళీ ప్రధాని అవుతారని చెప్పారు. తాను హుజూర్ నగర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కు ఒక్క సర్పంచ్ కూడా లేడని... అలాంటి పార్టీని ఎక్కడికో తీసుకొచ్చామని అనుచరులతో అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు భయపడి పోతున్నారని చెప్పారాయన.

సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారని... ఆ వ్యతిరేక బ్యాచ్ కు బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తారని.. ఈ కుట్రలు, కుతంత్రాలు మనకు అవసరమా? అంటూ అనుచరులను సైదిరెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.