రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి
  • మోడీ మంత్రి వర్గంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బాబుల్ సుప్రియో

కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్ బై ప్రకటించారు. ఇకపై తాను సమాజ సేవపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు బాబుల్ సుప్రియో ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన ఒకింత అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరిగింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్లు.. వేరే పార్టీల్లో కూడా చేరతారని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తనపై జరుగుతున్న ప్రచారాలు, వదంతులకు ఫుల్ స్టాప్ పెడుతూ శనివారం నాడు ఫేస్ బుక్ పోస్ట్ లో గుడ్ బై నిర్ణయాన్ని ప్రకటించారు.  
మోడీ కేబినెట్ లో రెండుసార్లు ఆయన సహాయక మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడారు. ఈ ఎన్నికలో ఆయన తృణమూల్ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ పరిస్థితుల్లో జరిగిన కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. గవర్నర్ గా పంపే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. అలాంటి అవకాశం పలువురికి వచ్చినా సుప్రియోకు ఇంకా రాలేదు. రేపో మాపో వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు, అభిమానులు ఊహిస్తున్న తరుణంలో ఆయన గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇకపై సమాజసేవపై దృష్టి సారిస్తానని బాబుల్‌ సుప్రియా స్పష్టం చేశారు.