హైదరాబాద్: గండిపేట ఫేక్ జీవో కేసులో YCP మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బొల్లా బ్రహ్మ నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ నమోదయిన కేసు 990 ఆఫ్ 2026లో అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది.
నకిలీ ప్రభుత్వ జీవోలను సృష్టించి, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రధాన సూత్రధారిగా ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు బొల్లా రమేశ్, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నారు. కేసు వివరాలను శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో మీడియాకు వివరించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో సుమారు 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 10 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి తమదేనంటూ గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి, మంగ అనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 2012లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిరుడు అక్టోబర్ 6న హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ.. ఆ 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ.. నిమ్మల కుటుంబ సభ్యులు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్ర పన్నారు. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వం తమకే ఆ భూమిని కేటాయించినట్టు ఐదు నకిలీ జీవోలను సృష్టించారు. వాటిని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ చేశారు. ఈ క్రమంలోనే భూమిని విక్రయించడానికి ఏపీకి చెందిన వినుకొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున కుదిరిన డీల్లో భాగంగా.. నిందితుల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే నుంచి నిమ్మల కుటుంబానికి రెండు విడతలుగా దాదాపు రూ.4 కోట్ల వరకు డబ్బు చేతులు మారినట్టు పోలీసుల విచారణలో తేలింది.
