న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పాలసీబజార్ పేరెంట్ కంపెనీ పీబీ ఫిన్టెక్ ఫౌండర్లు యాశిష్ దహియా, ఆలోక్ బన్సాల్ కంపెనీలో తమకున్న వాటాలో 0.82శాతాన్ని ఓపెన్ మార్కెట్లో విక్రయించారు. ఎన్ఎస్ఈలో శుక్రవారం జరిగిన ఈ బ్లాక్ డీల్ ద్వారా మొత్తం 38 లక్షల ఈక్విటీ షేర్లను సగటున రూ.1,751 ధరకు అమ్మారు.
దీని మొత్తం విలువ రూ.665.38 కోట్లుగా నమోదైంది. ఈ విక్రయం తర్వాత కంపెనీలో వీరి ఉమ్మడి వాటా 5.02 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోయింది. ఈ షేర్లను గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు గోల్డ్మన్ శాక్స్, సొసైటీ జనరల్, మోర్గాన్ స్టాన్లీలతో పాటు జర్మనీకి చెందిన మెట్జ్లర్ అసెట్ మేనేజ్మెంట్, వాసాచ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, బీఎన్పీ పారిబాస్, హాంగ్కాంగ్కు చెందిన విరిడియన్ అసెట్ మేనేజ్మెంట్ కొనుగోలు చేశాయి.
దేశీయ సంస్థలలో టాటా మ్యూచువల్ ఫండ్, కోటక్ సెక్యూరిటీస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్లు ఈ షేర్లను దక్కించుకున్నాయి. ఈ అమ్మకాల ఒత్తిడి కారణంగా శుక్రవారం ఎన్ఎస్ఈలో పీబీ ఫిన్టెక్ షేరు 3.85శాతం నష్టపోయి రూ.1,716 వద్ద ముగిసింది. కంపెనీ నికరలాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 54 శాతం వృద్ధి చెంది రూ.261 కోట్లుగా నమోదైంది.
గతేడాది ఇదే క్వార్టర్లో రూ.170 కోట్ల ప్రాఫిట్ సాధించింది. కాగా, కంపెనీ ఫౌండర్లు జూన్ 2025 లో రూ.920 కోట్లు, మే 2024 లో రూ.1,109 కోట్ల విలువైన వాటాలను
విక్రయించారు.
