ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నలుగురు సిబ్బంది సస్పెన్షన్ కు గురయ్యారు. అదేవిధంగా 3వ సంవత్సరం బీఎస్సీ(అగ్రికల్చర్) 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను గురువారం (జనవరి 08) రద్దు చేశారు వీసీ. వారిని తిరిగి వ్యవసాయ శాఖకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల వీసీ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య, ఇతర అధికారుల తో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాల ని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలించి, సీసీ ఫుటేజ్ ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షా ప్రశ్న పత్రాలు లీకు అవుతున్నట్లు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్రం గా విచారణ చేసేందుకు ముగ్గురు అధికారుల తో కమిటీని నియమించారు. ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ చేపట్టింది. .
Also Read : తెలంగాణలో IDTR ఏర్పాటు చేయండి
వ్యవసాయ శాఖ లో ఏఈఓ లు గా పని చేస్తూ.. వర్సిటీ లో ఇన్ సర్వీస్ కోటా లో 3 వ ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేశారు. ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారం తో లీకు చేసినట్లు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్ లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకి పంపుతున్నారనీ, ఈ వ్యవహారం లో పెద్ద ఎత్తున డబ్బు లు చేతులు మారిందని తేల్చారు.
ఒక పథకం ప్రకారం కొన్నేళ్లు గా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సిటీ ఈ అంశాన్ని చాలా తీవ్రం గా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటా లో వచ్చిన సుమారు 35 మంది ని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖ కి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2014 నుంచి 2024 వరకూ పూర్తి స్థాయిలో విశ్వ విద్యాలయం లో ఉన్నత అధికారులు లేకపోవడం తో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటనీ ఉప కులపతి అల్డాస్ జానయ్య పేర్కొన్నారు. ఈ క్రమంలో వెంటనే ప్రక్షాళన మొదలు పెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని వివరించారు.
