- మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా ఘటన
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా చోటీభేటియా పోలీస్స్టేషన్ పరిధి కోరోస్కోడా అడవుల్లో శనివారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు డీఆర్జీ జవాన్లు దుర్మరణం పాలయ్యారు.
బస్తర్ ఐజీ సుందర్రాజ్పి కథనం ప్రకారం.. నక్సల్స్ లొంగుబాటు అనంతరం వారిచ్చిన పక్కా సమాచారంతో అడవుల్లో డంప్లను వెలికి తీస్తున్నారు. చోటీభేటియా పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో డంపుతో పాటు మందుపాతరలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో కాంకేర్ జిల్లాకు చెందిన డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డు) టీమ్ను రంగంలోకి దించారు.
వీరు కోరోస్కోడా అడవుల్లో డంపును వెలికి తీసి, మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పేలిపోయింది. భారీ శబ్ధంతో పేలడంతో ఎస్సై సుఖ్రాం వట్టి, కానిస్టేబుళ్లు కృష్ణా కోమరా, సంజయ్గాడ్పాలేలు అక్కడికక్కడే చనిపోయారు.
తీవ్రంగా గాయపడిన జవాన్ పరమానంద్ కోమరాను అత్యవసర చికిత్స కోసం రాయ్పూర్కు హెలీకాప్టర్లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇప్పటి వరకు లొంగిపోయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లో వారు అమర్చిన 300కు పైగా మందుపాతరలను నిర్వీర్యం చేశామని, కానీ, తాజా ఘటనలో అవి పేలి నలుగురు జవాన్లు చనిపోవడం బాధాకరమని ఐజీ తెలిపారు.
