చెయ్యని నేరానికి పడిన శిక్ష.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా రిలీజ్

చెయ్యని నేరానికి పడిన శిక్ష.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా రిలీజ్

 మీరట్: అతడో రైతు బిడ్డ. పన్నెండేండ్ల కింద 18 ఏండ్ల వయసులో చెయ్యని నేరం మీద పడింది. ఇద్దరు కానిస్టేబుళ్లను చంపినట్లు కోర్టు తేల్చి కటకటాలకు పంపింది. దీంతో ఆర్మీలో చేరాలన్న ఆ యువకుడి కల చెదిరిపోయింది. అయినా, అతడు పట్టు విడవలేదు. రెండేండ్ల తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చి.. లా చదివాడు. తన కేసు తానే వాదించుకొని నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసి గెలిచిన ఉత్తరప్రదేశ్​కు చెందిన అమిత్ చౌదరి స్టోరి ఇది.. 

2011లో చీకటి రోజు.. 

మీరట్ పరిధి బాగ్‌‌పత్‌‌లోని కిర్తల్ గ్రామానికి చెందిన ఒక రైతు కొడుకు అమిత్ చౌదరి. 2011లో ఇద్దరు కానిస్టేబుళ్లను కైల్  ముఠా సభ్యులు హత్య చేశారు. ఈ కేసులో చౌదరి ఇరుక్కున్నాడు. మృతులు ఇద్దరు పోలీసులు కావడంతో కేసును వెంటనే తేల్చాలని అప్పటి సీఎం మాయావతి ఆదేశించారు. దీంతో మర్డర్​ వెనకున్న కైల్ గ్యాంగ్​లోని సభ్యులందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజానికి మర్డర్ జరిగిన సమయంలో చౌదరి స్పాట్​లో లేకపోయినప్పటికీ కైల్ గ్యాంగ్​ సభ్యులలో ఒకడిగా పేర్కొంటూ అమిత్ చౌదరి పేరును అందులో చేర్చారు. దీంతో జైలు శిక్ష పడింది.

బెయిల్ వచ్చిన నుంచి పట్టు వీడలే.. 

2013లో బెయిల్​మీద విడుదలైన అమిత్ చౌదరి.. డిగ్రీ, ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎమ్ పూర్తి చేశాడు. బార్ కౌన్సిల్​లో మెంబర్ షిప్ సాధించాడు. తన కేసును తానే వాదించుకున్నాడు. తనను అరెస్ట్ చేసిన పోలీసులనే బోనులో నిలబెట్టి తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులో నిరూపించుకున్నాడు. తనతో పాటు ఈ కేసులో ఇరుక్కున్న మరో 13 మంది నిందితులను కూడా కోర్టు ఇటీవలే నిర్దోషులుగా విడుదల చేసింది. అసలు నేరస్థులైన ముగ్గురిలో గ్యాంగ్​స్టర్ కైల్​ పోలీసుల ఎన్​కౌంటర్​లో చనిపోగా, ఒకరు క్యాన్సర్​తో మరణించారు. మూడో వ్యక్తి జీవిత ఖైదుగా ఉన్నాడు. తాను క్రిమినల్ జస్టిస్​లో పీహెచ్​డీ చేయనున్నట్లు చౌదరి చెప్పారు.