న్యూఢిల్లీ : ఇద్దరూ మైనర్లే.. ఎప్పుడో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ విషయంలో పగ పెంచుకున్నాడొకడు. మరో ఐదుగురితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. నమ్మించి ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చిండు. మద్యం తాగించి.. కత్తులతో పొడిచి, ఇటుకలతో కొట్టి దారుణంగా చంపాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. శుక్రవారం ఉదయం సౌత్ ఢిల్లీలోని మాలవీయనగర్లో వివేక్ డెడ్బాడీ కనిపించింది. 17 ఏళ్ల వివేక్, ప్రధాన నిందితుడైన మైనర్కు మధ్య కొన్ని నెలల కిందట గొడవ జరిగింది.
అప్పుడు వివేక్ తనను కొట్టాడన్న కారణంతో పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తాగుదాం రమ్మంటూ గురువారం వివేక్ను బయటికి రప్పించాడు. ఆ తర్వాత సత్పులా పార్క్కు తీసుకెళ్లాడు. ప్రధాన నిందితుడు, అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న మరో ఐదుగురు కలిసి వివేక్పై కత్తులు, ఇటుకలతో మూకుమ్మడిగా దాడి చేసి చంపారు. ‘‘శుక్రవారం ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. మృతుడిని బేగంపూర్లోని ఇంద్రా క్యాంప్నకు చెందిన వివేక్గా గుర్తించాం. శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి” అని పోలీసులు తెలిపారు. ముగ్గురు మైనర్లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు.