హైదరాబాద్: చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీల్లో ఇంధన సరఫరా భారీగా తగ్గింది. గ్యాస్ సరఫరా గతంతో పోల్చుకుంటే భారీగా తగ్గి మళ్లీ స్వల్పంగా పెరిగింది. చర్లపల్లిలోని మూడు గ్యాస్ ప్లాంట్ల నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు ఇంధన సరఫరా జరుగుతుంది.
మూడు ప్లాంట్లలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు మాత్రమే గ్యాస్ ఫిల్లింగ్ జరుగుతుంది. కొనుగోలుదారులకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టోకెన్ల వారీగా పరిమిత సంఖ్యలో కమర్షియల్ సిలిండర్లను ఆయా కంపెనీలు అందజేస్తున్నాయి.
కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ సిటీలోని కొన్ని వ్యాపార సముదాయాలు, హోటల్స్, రెస్టారెంట్లలో గ్యాస్ పొయ్యి వెలిగించే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్లో వేలాదిగా హాస్టల్స్ ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కమర్షియల్ గ్యాస్ అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడి గ్యాస్ దొరకడం కష్టమవుతుందని ప్రజలు అధిక సంఖ్యలో బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో.. చర్లపల్లిలోని ప్రధాన ప్రాంతాల్లో ఇంధన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
