- కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే పేదలకు న్యాయం
- తుక్కుగూడ జనజాతర సభలో ఎంపీ రంజిత్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి అందేలా చూస్తానని ఎంపీ డాక్టర్జి.రంజిత్రెడ్డి హామీ ఇచ్చారు. తన పరిధిలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందేలా చూస్తానని చెప్పారు. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్పార్టీ నిర్వహించిన ‘జనజాతర’ భారీ బహిరంగ సభలో ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటీషోడు దేశాన్ని ఊడ్చుకుపోయాక, పేదోళ్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, గాంధీ, నెహ్రూ కుటుంబాలేనన్నారు.
సంక్షోభం నుంచి సంక్షేమం, దేశానికి దశ, దిశ దొరికింది కాంగ్రెస్ప్రభుత్వంలోనేనని చెప్పారు. చేవెళ్ల గడ్డ హైదరాబాద్సిటీకి కూరగాయలు, పువ్వులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అందిస్తోందని చెప్పారు. చేవెళ్ల ప్రజలకు అందుబాటులో లేని నాయకులెవరూ తనకు పోటీ కాదని రంజిత్రెడ్డి తన ప్రత్యర్థులకు చురకులు అంటించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందారన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి నినాదంతో బరిలో నిలిచానని, ఈసారి పంచ సూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. అవి ‘అభివృద్ధి, అందుబాటు, విద్య, వైద్యం, సంక్షేమం’ అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి పేదలకు పంచడమే తన జెండా, ఎజెండా అని స్పష్టం చేశారు.