ఆలేరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది : బీర్ల ఐలయ్య

ఆలేరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది : బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్,  ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్ తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం తిర్మలాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, డీసీసీ చీఫ్ అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సభాస్థలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐలయ్య మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఈనెల 6న తుర్కపల్లి మండలం తిర్మలాపూర్ లోని బహిరంగ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్ ను సీఎం ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. 

దాదాపుగా వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్లతో చేపట్టే గంధమల్ల రిజర్వాయర్ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాంపూర్ తండాలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో రూ.183 కోట్లతో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజ్ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సీఎం సభకు 50 వేల మంది వస్తారని ముందుగా అంచనా వేశామని, కానీ ప్రజల స్పందన చూస్తుంటే.. దాదాపు 70 వేల మంది వరకు వచ్చే అవకాశాలున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం హాజరుకానున్నట్లు తెలిపారు. వారి వెంట ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉన్నారు.