ముషీరాబాద్,వెలుగు: బీఆర్ఎస్ లెక్కనే కాంగ్రెస్ పార్టీ సైతం బీసీలకు తక్కువ టికెట్లు ఇస్తే చూస్తూ ఊరుకోమని, గాంధీభవన్ను లక్షమందితో ముట్టడించి తాళాలు వేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం దోమలగూడలోని బీసీ భవన్లో చాకలి ఐలమ్మ128వ జయంతిని బీసీ సంఘాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు ఆమె ఫొటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ గడీల దొరలకు, పోలీస్ పట్వారీలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. కాంగ్రెస్ ఉదయ్పూర్ డిక్లరేషన్ మేరకు బీసీలకు టికెట్లు ఇస్తామని గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయించి, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ పేరుతో ఢిల్లీలో మీటింగులు పెట్టి ఎట్లా ఎగ్గొట్టాలో కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకల శ్యాం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.