
స్కీమ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మూఠా గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టుచేశారు. మూఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సైబర్ క్రైమ్ పోలీసుల తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మేడ్చల్ ప్రాంతానికి చెందిన శివరామకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. మూడు నెలల క్రితం ఒక ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వ్యక్తి తన పేరు వివేక్ అగర్వాల్అని గణేశ్ ట్రేడర్స్ కంపెనీలో సీనియర్ ఎగ్జిగ్యూటివ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను అంటూ పరిచయం చేసుకున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా కొత్త స్కీమ్ స్టార్ట్ చేశామని దానికి సంబంధించి info@ganeshtraders.co.in మెయిల్ను శివరామకృష్ణకు పంపించారు. ఈ స్కీమ్లో బంగారంపై పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని శివరామకృష్ణను నమ్మించాడు. ఆ తర్వాత వివేక్ తమ కంపెనీలో బంగారం స్కీమ్పై రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే పెట్టిన డబ్బుకు రూ. 27లక్షల తిరిగి 45 రోజుల్లో మీకు చెల్లిస్తామని నమ్మబలికాడు. వివేక్ మాటలు నమ్మిన రామకృష్ణ రూ. 10,11,111లు గణేష్ ట్రేడర్స్ పేరిట బ్యాంకులో డబ్బులు చెల్లించాడు. 45 రోజులు గడిచిన కూడా తనకు డబ్బులు రాక ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసాపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను అశ్రయించాడు. తానను బంగారంపై పెట్టుబడులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ సీఐ రామయ్య దర్యాప్తును ప్రారంభించాడు.
బ్యాంక్వివరాల అధారంగా దొరికిన నిందితులు..
శివరామకృష్ణ నిందితులకు బ్యాంకు ద్వారా చెల్లించిన డబ్బుల అధారంగా సైబర్ క్రైమ్స్ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బ్యాంక్ వివరాలు, సెల్ఫోన్ అధారంగా నిందితులు గుజరాత్లోనిఅహ్మదాబాద్కు చెందిన వారిగా గుర్తించి అక్కడికి వెళ్లి గుజరాత్ పోలీసుల సహకారంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
గ్రూప్గా ఏర్పడి మోసాలు..
అహ్మదాబాద్లోని మిగానినగర్ జీహెచ్బీసీ కాలనీకి చెందిన నాగరాజు(35) ప్రొప్రైటర్గా, అదే ప్రాంతానికి చెందిన రవికుమార్(30), తరుణ్(36) మేనేజర్లుగా ఓ ఫేక్ కంపెనీ పేరుతో ముగ్గురు కలిసి గ్రూప్గా ఏర్పడి పెట్టుబడి సలహాదారుల పేరిట ప్రజలను మోసం చేయడం ప్రారంభించారు. గతంలో వీరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్కీమ్లను నమ్మకండి..
తమ కంపెనీలో బంగారం, ఇతర స్కీమ్లపై పెట్టుబడి పెట్టండి మీరు పెట్టిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తాం అంటూ ఫోన్లు చేస్తే వెంటనే నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇలా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కేసు దర్యాప్తులో సీఐలు రామయ్య, కె. శ్రీనివాస్, ఎస్ఐ విజయ్వర్ధన్, సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.