
తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభిస్తామన్నారు. కొత్త డిగ్రీ కళాశాలలను అక్టోబర్ 15 నుండి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
అత్యున్నత స్థాయి ప్రమాణాలతో గురుకులాలు, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో భాగంగా హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్లా, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలన్నారు. నూతన గురుకులాలతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరిందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 41 కులసంఘాలకు 95.25కోట్లు, కోకాపేట, ఉప్పల్ బగాయత్ లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమై పట్టాలు పొందాయన్నారు.మిగతా సంఘాల్లో ఎకగ్రీవాలు జరుగుతున్నాయన్నారు. ఇలా ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈనెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లు మరింత విస్తృతంగా అభ్యర్థులకు సేవలు అందించాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు, 12 స్టడీ సర్కిళ్లకు అధనంగా అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. వీటి ద్వారా దాదాపు 25వేల మందికి పైగా నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మల్లయ్యబట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సంధ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.