- చీఫ్ గెస్ట్గా హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం యూనివర్సిటీ 17వ గ్రాడ్యుయేషన్ డే శనివారం అట్టహాసంగా జరిగింది. గీతం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 1,990 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఇందులో 1,532 మంది అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కాగా, 372 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, మరో 86 మంది పీహెచ్డీ స్కాలర్లు ఉన్నారు. సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులకు పట్టాలు ప్రదానం చేశారు.
గీతం ప్రెసిడెంట్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ అధ్యక్షత జరిగిన ఈ వేదికపై చేనేత రంగంలో విశేష కృషి చేసి, వస్ర్త వారసత్వాన్ని పరిరక్షించడంలో సేవలందించిన చేనేత కళాకారుడు గజం గోవర్ధన్కు గీతం గౌరవ డాక్టరేట్ను అందించి సత్కరించారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 17 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, అత్యుత్తమ పరిశోధన విజయాలు చేపట్టిన గీతం ప్రొఫెసర్లకు బెస్ట్ రీసెర్చర్ అవార్డులను అందజేశారు.
బీటెక్లోని అన్ని విభాగాల్లో టాపర్గా నిలిచి, కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన ప్రణవ్ రాహుల్ అనే విద్యార్ధి రెండు బంగారు పతకాలు అందుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ అంకితభావం, కఠోర శ్రమతో ఎంచుకున్న రంగాల్లోనే విజయం సాధించగలమని పేర్కొన్నారు.
గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ మాట్లాడుతూ విద్యార్థులు తమని తాము నమ్మి కలలు కనాలని, ఏడు మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ తమ కలలను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం చాన్స్లర్ విరేంద్ర సింగ్ చౌహాన్, వీసీ ఎర్రోల్ డిసౌజా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, రిజిస్టార్ గుణసేకరణ్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
