మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పాపను ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి సురేష్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను అమ్మే ప్రయత్నంలో.. వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సురేష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్లోని EWS కాలనీలో చిన్నారి కృష్ణవేణి కిడ్నాప్కు గురైంది. జులై 05వ తేదీ బుధవారం కిరాణా షాప్ కు వెళ్లిన పాప ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుప్రక్కల అంతా వెతికారు. కానీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. సీసీ టీవీ ఫుటేజ్ లో మతిస్థిమితం లేని వ్యక్తి దగ్గర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సురేష్ అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు పోలీసులు. సురేష్ రాత్రి 8 గం.ల సమయంలో కిరాణా షాప్ దగ్గరికి వచ్చాడని.. అదే సమయంలో పాప చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్లిందన్నారు. స్థానికులు కూడా పాపను సురేష్ తీసుకెళ్లడం చూశామని పోలీసులకు తెలిపారు.
సురేష్ పై అనేక కేసులు ఉన్నట్లు తేలింది. అతడు గతంలో కాలేజీలో పనిచేసిన సమయంలోనూ.. సినిమా థియేటర్లో పనిచేసే సమయంలోనూ అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిన్నారిని కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా 15 గంటల వ్యవధిలో చిన్నారిని సురక్షితంగా కాపాడారు.