
- ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ ఆదేశాలు
- నిర్వహణకు బల్దియా సిద్ధం
- నియోజకవర్గంలో 3,89,954 ఓటర్లు
- నామినేషన్ల చివరి తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో ఎన్నికలు జరగనుండగా, అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలను జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం నిర్వహిస్తుంది. దీంతో అంతా సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో బై పోల్కు సంబంధించిన పనులను బల్దియా స్పీడప్చేసింది.
కొత్త ఓటర్లకు అవకాశం..
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్ల చివరి రోజు వరకు ఫామ్–6 ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేస్తారు. నామినేషన్ల వరకు వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకొని ఫైనల్ ఓటర్ లిస్ట్ను రిలీజ్చేస్తారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,89,954 ఓటర్లుండగా, ఉప ఎన్నిక నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికకు ఒక్కో ఓటు ఎంతో కీలకం కావడంతో లీడర్లు కూడా కొత్త ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దరఖాస్తు చేయించే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త ఓటర్లను గుర్తించే పనిలో ఆయా పార్టీల లీడర్లు పడ్డట్టు సమాచారం.
ఈవీఎంలు, భద్రతపై ఆరా..
ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంల లభ్యత, భద్రతపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. బై పోల్కు 500 ఈవీఎంలు అవసరముండగా, జీహెచ్ఎంసీ 1000 వరకు ఈవీఎంలను సిద్ధంగా ఉంచింది. ఇక భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను వినియోగించుకోనున్నారు. పోలింగ్, కౌంటింగ్కు 1500 మంది స్టాఫ్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించారు. మొత్తానికి ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ ప్రకటించింది.