హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను ధిక్కరిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎస్డబ్ల్యూఎం (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ను, చార్మినార్ జోన్ పరిధిలోని మలక్పేట (డివిజన్ 27), మూసారాంబాగ్ (డివిజన్ 29) విభాగాలకు బదిలీ చేస్తూ ఈ నెల 8న కమిషనర్ ఆదేశాలిచ్చారు.
అయితే, బదిలీ ఆర్డర్లు వచ్చి రోజులు గడుస్తున్నా ఆయన కొత్త చోట బాధ్యతలు తీసుకోలేదు. కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధులకు హాజరుకాకపోవడంపై ఆరు రోజుల క్రితం కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కాలంలో శ్రీనివాస్ హైదరాబాద్లోనే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

