న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతామని యూఎస్ ఫెడ్ సిగ్నల్స్ ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. జనవరి ఆప్షన్ సిరీస్ ఎక్స్పైరీ కూడా ఉండడంతో ఈ సెషన్లో వోలటాలిటీ ఎక్కువగా ఉంది. విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోతుండడం, డాలర్ మారకంలో రూపాయి విలువ తగ్గడం మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ గురువారం 581 పాయింట్లు (ఒక శాతం) తగ్గి 57,277 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 1,000 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 168 పాయింట్లు (0.97 శాతం) పడి 17,110 వద్ద ముగిసింది. తాజాగా జరిగిన ఫెడ్ మీటింగ్ వడ్డీ రేట్లను పెంచలేదు. కానీ, మార్చి నుంచి వడ్డీ రేట్లుపెరుగుతాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో బాండ్ కొనుగోళ్లను ఈ సెంట్రల్ బ్యాంక్ నిలిపివేసింది. యూఎస్లో వడ్డీ రేట్లు పెరిగితే ఇండియా లాంటి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపుతున్నారని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రంగనాథన్ అన్నారు. వాల్యూ షేర్లు గురువారం సెషన్లో పెరిగాయని, ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయని అన్నారు. ఆటో షేర్లు కూడా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో వోలటాలిటీ ఎక్కువగా ఉండడంతో మన మార్కెట్లూ పడుతున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. యూఎస్ ఫెడ్ మీటింగ్ క్లోజవ్వడంతో ఇక మార్కెట్లో స్టెబిలిటీ ఉంటుందని అంచనావేయొచ్చన్నారు. మార్కెట్ కదలికలను కంపెనీల రిజల్ట్స్, బడ్జెట్ డిసైడ్ చేస్తాయని అన్నారు. బ్యాంకింగ్ సెక్టార్ పెరగడం బాగానే ఉన్నా, మిగిలిన సెక్టార్ల షేర్లు కూడా పెరగాలన్నారు.