
- ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీని కడితే వాటాల్లో హక్కులను క్లెయిమ్ చేసుకోవచ్చంటున్న అధికారులు
- అదే సమయంలో 23 వేల ఎకరాలు ముంపునకు గురయ్యే చాన్స్
- ఇచ్చంపల్లి, సమ్మక్కసాగర్కు మధ్య దూరం 12 కిలోమీటర్లే
- ఫలితంగా వరద ఎక్కువొస్తే ఆపరేషన్ ప్రొటోకాల్లో ఇబ్బందులు
- ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీపై చర్చలకు సిద్ధమని ఇటీవల సీఎం రేవంత్సూత్రప్రాయ నిర్ణయం
- జీసీ లింక్కు బదులు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి కావేరికి తరలించాలంటున్న ఏపీ
హైదరాబాద్, వెలుగు: గోదావరి–కావేరి (జీసీ) అనుసంధానంలో ‘ఇచ్చంపల్లి’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ చక్రం తిప్పుతున్న నేపథ్యంలో.. జీసీ లింక్పై చర్చ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటికే ఐదు సార్లు కన్సల్టేషన్ మీటింగులను నిర్వహించినా ఆ ప్రాజెక్టు ఓ కొలిక్కి రాలేదు. కేంద్రం ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించి తమిళనాడుకు నీటిని తరలిస్తామని చెబుతున్నా.. మన అధికారులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.
ఇప్పటికే ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీని వాడుకోవాలని సూచిస్తున్నారు. నీటి వాటాలూ తేల్చకపోవడంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో జీసీ లింక్లో ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణంపై చర్చించుకుందామని ప్రకటించడంతో మరోసారి అది చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ నెల 24న హైదరాబాద్ జలసౌధలో నిర్వహించాల్సి ఉన్న కన్సల్టేషన్ మీటింగ్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే జీసీ లింక్లో ఇచ్చంపల్లి బ్యారేజీని కడతారా.. లేదంటే ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీనే వినియోగించుకుంటారా అన్న చర్చ జరుగుతున్నది.
నీటి హక్కులు క్లెయిమ్ చేసుకోవచ్చా..
ఇప్పటిదాకా గోదావరిలో 1486 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు కేటాయించగా.. అందులో మనకు 968 టీఎంసీలను కేటాయించారు. అందులో ఇప్పటిదాకా మనం కేవలం 946 టీఎంసీలకు క్లియరెన్సులు వచ్చాయి. అయితే, ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీని నిర్మించుకుంటే.. నీటి కేటాయింపుల్లో హక్కులను క్లెయిమ్ చేసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ కేంద్రమే దీనిని నిర్మించి ఇస్తున్నది కనుక.. ఎంత లేదన్నా 50 టీఎంసీల వరకు హక్కులు పొందేందుకు అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. పోలవరం బనకచర్ల లింక్తో భారీ ప్రాజెక్టుకు శరవేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. మనకు ఇచ్చంపల్లి బ్యారేజీతో హక్కులపై పోరాడే అవకాశం ఉంటుందన్న వాదన వినిపిస్తున్నది.
సమస్యలూ ఉన్నయ్..
ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ నిర్మిస్తే కొన్ని సమస్యలూ తప్పవని అధికారులు అంటున్నారు. ఇప్పటికే సమ్మక్కసాగర్ బ్యారేజీని నిర్మించిన నేపథ్యంలో.. దాని బ్యాక్ వాటర్ మీద కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఇచ్చంపల్లి బ్యారేజీ ఉంటుంది. ఫలితంగా వరదల సమయంలో ఇటు ఇచ్చంపల్లి, అటు సమ్మక్కసాగర్ బ్యారేజీల ఆపరేషన్ ప్రొటోకాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రెండు బ్యారేజీల మధ్య తక్కువ దూరం ఉండడంతో అకస్మాత్తుగా భారీ వరద వస్తే దిగువన ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి విడుదల చేయడం కష్టతరమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇటు ఇచ్చంపల్లికి ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు. బ్యారేజీని 87 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని భావిస్తుండడంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముంపు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. దాదాపు 23 వేల ఎకరాలు మునిగే ముప్పు ఉందని చెబుతున్నారు. అది కాకుండా.. లింక్లో భాగంగా ఆన్లైన్ స్టోరేజీగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ ను వాడుకోవాలనుకుంటున్నారు. దీంతో ఇచ్చంపల్లి నుంచి సాగర్ వరకు నీటిని తరలించేందుకు 315 కిలోమీటర్ల మేర కాల్వలు, టన్నెల్స్ వంటి కన్వేయర్ సిస్టమ్ను నిర్మించాల్సి ఉంటుంది. దానికి మరో 18 వేల ఎకరాల వరకు భూసేకరణ అవసరమవుతుందన్న వాదన వినిపిస్తున్నది.
కేంద్రం ఆధీనంలోనే నిర్వహణ..
జీసీ లింక్ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నేపథ్యంలో ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్వహణ మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉండే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం పట్టించుకుంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇచ్చంపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప.. దిగువన ఉన్న సమ్మక్కసాగర్కు, దేవాదుల, సీతమ్మసాగర్ వంటి ప్రాజెక్టులకు నీళ్లిచ్చే పరిస్థితి ఉండదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్న సమ్మక్కసాగర్ 47 టీఎంసీలు, దేవాదుల 38 టీఎంసీలు, సీతమ్మసాగర్ 67 టీఎంసీలు, మోడికుంట 1.5 టీఎంసీలు కలిపి 153.5 టీఎంసీల వినియోగానికి హక్కులు కల్పించాలని మన అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ నీళ్లతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీళ్లు తరలించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు.
సమ్మక్కసాగర్ నుంచి తీసుకుంటేనే..
ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఇన్ని సమస్యలున్న నేపథ్యంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీని వాడుకోవాలని కేంద్రానికి అధికారులు ఇప్పటికే సూచించారు. కొత్తగా కన్వేయర్ సిస్టమ్ను నిర్మించాల్సిన అవసరం లేకుండా.. సమ్మక్కసాగర్ సిస్టమ్ ద్వారా సాగర్ రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సమ్మక్కసాగర్ బ్యారేజీ ఎత్తు కేవలం 85 మీటర్లే. జీసీ లింక్లో తమిళనాడుకు నీటిని తరలించాలంటే 87 మీటర్లకు బ్యారేజీ ఎత్తును పెంచాల్సి ఉంటుంది.
బ్యారేజీ ఎత్తు పెంపునకు చత్తీస్గఢ్ అంగీకరిం చడం లేదు. కేవలం 85 మీటర్ల ఎత్తుకే ఆ రాష్ట్రం ఎన్వోసీ ఇచ్చింది. 87 మీటర్ల పెంపునకు ససేమిరా అంటున్నది. ఈ క్రమంలోనే ఇచ్చంపల్లి బ్యారేజీకి ఒప్పుకోవాలా.. సమ్మక్కసాగర్నే వాడుకొమ్మనాలా అనేది గందరగోళంగా మారింది.
సగం వాటాకు డిమాండ్
జీసీ లింక్లో కీలకమైన నీటి వాటాలపైనా ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలను తరలించాలని భావిస్తుండగా.. మన భూభాగం నుంచే నీటిని తరలిస్తున్నారు కాబట్టి 50 శాతం (74 టీఎంసీలు) వాటా ఇవ్వాలని మన అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్రం మాత్రం 45 టీఎంసీలకు సరిపెట్టుకోవాలని సూచిస్తున్నది. ఇక, ఏపీకి 44 టీఎంసీలు, కర్ణాటకకు 16 టీఎంసీలు, తమిళనాడుకు 38 టీఎంసీల చొప్పున నీటిని తరలించాలని కేంద్రం భావిస్తున్నది. దీనిపై ఈ నెల 24న ఆరో కన్సల్టెన్సీ మీటింగ్ను నిర్వహించాల్సి ఉన్నా.. అది కాస్తా వాయిదా పడింది.
మరోవైపు ఈ చర్చలు తేలకపోతుండడంతో ఏపీ ఇదే అదునుగా భావించి పోలవరం బనకచర్ల లింక్లో భాగంగా కావేరికి నీటిని తరలించుకోవచ్చని కేంద్రానికి ప్రతిపాదనలు పెట్టింది. ముందు నుంచి పోలవరం నుంచి తీసుకోవాలని చెబుతున్న ఏపీ.. ఇప్పుడు మాట మార్చి పోలవరం బనకచర్ల లింక్లో కీలకంగా మారిన బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి కావేరికి నీటిని తరలించుకోవాలని, తద్వారా దూరం కూడా తగ్గుతుందని కేంద్రానికి సూచనలు చేస్తున్నది. ఫలితంగా ఆ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టేలా.. ఆర్థిక సహకారం అందించేలా ఏపీ సీఎం చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఇటు కేంద్రం అనుకున్న లక్ష్యం.. ఏపీ అనుకుంటున్న లక్ష్యం రెండూ నెరవేరుతాయని కేంద్రానికి సంకేతాలు పంపిస్తున్నారు.