పూజలు చేస్తమని చెప్పి.. బంగారం చోరీ

పూజలు చేస్తమని చెప్పి..  బంగారం చోరీ

ఉప్పల్, వెలుగు: పూజలు చేస్తమని చెప్పి వృద్ధురాలిని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు ఆమె బంగారు గొలుసుతో పరారైన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శనగర్ జర్నలిస్టు కాలనీలో ఉండే కాసారపు అనంతలక్ష్మి(65) ఇంటికి బుధవారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము గురు పూజారులమని ఆమెకు చెప్పారు. ఇంట్లో మంచి జరిగేందుకు పూజలు చేసి వరాలు ఇస్తామని నమ్మించారు. అనంతలక్ష్మితో పాటు మానసిక దివ్యాంగుడైన ఆమె మనవడు విష్ణువర్ధన్​ను ఇంట్లో కూర్చొబెట్టి పూజ మొదలుపెట్టారు. ఒక గిన్నెలో బియ్యం పోసి అందులో బంగారు గొలుసును వేయాలన్నారు. 

దీంతో  అనంతలక్ష్మి  తన మెడలోని 2 తులాల బంగారు గొలుసును బియ్యం గిన్నెలో  వేసింది. పూజ తర్వాత స్నానం చేయాలని సదరు పూజారులు చెప్పగా.. ఆమె వెళ్లింది. ఇదే అదనుగా ఇద్దరు వ్యక్తులు బియ్యం గిన్నెలోని బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. స్నానం చేసి బయటికి వచ్చిన అనంతలక్ష్మికి పూజారులు కనిపించకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని ఓయూ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.