హైదరాబాద్: భారత దేశ అంతరిక్షం రంగంలో మరో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన దేశీయ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్–-1’ ప్రయోగం విజయవంతమైంది. శనివారం (జులై 18) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ విక్రమ్ 1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని భూ కక్షలోకి ప్రవేశించింది. తద్వారా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది.
షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలతో చివరి నిమిషంలో ప్రయోగం నిలిచిపోయింది. ప్రయోగాన్ని 35 నిమిషాల పాటు వాయిదా వేసిన అధికారులు.. అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రయోగం చేపట్టారు. రెండోసారి ఎలాంటి ఆటంకం లేకుండా విక్రమ్ 1 రాకెట్ మంటలు కక్కుతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో ప్రైవేట్ స్పేస్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. విక్రమ్ 1 ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవడంతో పాటు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. స్కైరూట్ టీమ్ను ప్రశంసించారు.
విక్రమ్ 1 విశేషాలు:
హైదరాబాద్కు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1), భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ కమర్షియల్ ఆర్బిటల్ రాకెట్. 2025 నవంబర్లో ఈ రాకెట్ను ఆవిష్కరించారు. 480 కిలోల బరువున్న ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి (LEO) తీసుకెళ్లగలదు.
దీనిని పూర్తిగా కార్బన్ ఫైబర్తో నిర్మించడం విశేషం. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీద ఈ రాకెట్కు 'విక్రమ్-1' అని పేరు పెట్టారు. ఈ ప్రయోగంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘వందేమాతరం’ అని చేతిరాతతో రాసిన ఒక పోస్ట్కార్డ్ను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు.
ప్రధాని మోడీ సందేశంతో పాటు స్కైరూట్ బృంద సభ్యులు, ఇన్వెస్టర్లు, పాలసీ మేకర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన పోస్ట్కార్డులను కూడా నింగిలోకి పంపించనున్నట్టు సంస్థ తెలిపింది. స్కైరూట్ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు.
ప్రత్యేకత: ఇది 3D ప్రింటెడ్ ఇంజన్లను కలిగి ఉండి.. పూర్తిగా కార్బన్-ఫైబర్ బాడీ రాకెట్. కార్బన్ ఫైబర్ వాడటం వలన ఇది తేలికగా, బలంగా ఉంటుంది.
సామర్థ్యం: సుమారు 300 - 480 కిలోల బరువున్న ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల లో–ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి ప్రవేశపెట్టగలదు.
పరిశ్రమ: ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో, 100 శాతం భారతదేశంలోనే తయారైంది.
