
- ఈ-ఆఫీస్’ మోడ్లో మంత్రివర్గ సమావేశాలు
- ఎజెండా, మినిట్స్ అన్నీ డిజిటల్ మోడ్లోనే..
- మంత్రుల ముందున్న డెస్క్టాప్లోనే అన్ని వివరాలు
- ఏం మాట్లాడినా.. డిజిటల్ రికార్డింగ్
- మూడు నెలలకోసారి కేబినెట్ నిర్ణయాలపై రివ్యూ
- జులై 10న భేటీ కానున్న మంత్రివర్గం‘
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పాలనలో కీలక మార్పులకు కేబినెట్ శ్రీకారం చుట్టనున్నది. ఇకపై అన్ని మంత్రివర్గ భేటీలు ‘ఈ ఆఫీస్’ మోడ్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పేపర్లెస్ పాలనకు ఇది నాంది పలుకుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని ఆశిస్తున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే అన్ని ఫైళ్లు, నివేదికలను పరిశీలించి, ఆమోదించే విధానం అమల్లోకి రానున్నది.
ఎజెండా, మినిట్స్ అన్నీ డిజిటల్ మోడ్ లోనే ఉండనున్నాయి. ఫిజికల్ గా ప్రింట్ లు ఉండవు. కేబినెట్ లో కూర్చున్న మంత్రుల ముందున్న డెస్క్ టాప్ లో ఎజెండా డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత సీఎం, మంత్రులు మాట్లాడిన అంశాలు కూడా డిజిటల్ విధానంలో రికార్డు అవుతాయి. కేబినెట్లో చర్చించింది బయటికి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా, జులై 10న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది.
ఇటీవల జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక మంత్రివర్గం సమావేశమైన వెంటనే.. తదుపరి కేబినెట్ భేటీని కూడా నిర్ణయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. రానున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇందులోనే రిజర్వేషన్ల అంశాన్ని కూడా తేల్చనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే..
మంత్రులు.. సెక్రటరీలతో క్వార్టర్ రివ్యూ
ప్రభుత్వ నిర్ణయాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఇక ప్రతీ మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రభుత్వ పథకాలు, విధానాల అమలు తీరును పర్యవేక్షించడానికి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పైగా కేబినేట్ నిర్ణయాల అమలులో వేగం పెరుగుతుందని చెప్తున్నారు. ఈ సమీక్ష ద్వారా ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వం అనుకుంటున్నది.
సీఎస్ మార్క్.. సీఎం ఓకే
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు.. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. వారంలో ఒకటి లేదా రెండు రోజులు క్షేత్ర పర్యటనలు చేస్తూ రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించడం, ఈ భేటీలో ‘ఈ ఆఫీస్’ పద్ధతి అమలు చేయడం, ప్రతి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై మూడు నెలలకోసారి రివ్యూ చేయడం వంటి అంశాలను ఆయన ప్రతిపాదించారు.
దీనికి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకట్రెండు రాష్ట్రాల్లోనే ‘ఈ–కేబినెట్’ భేటీలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని అమలు తీరును పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కూడా సీఎస్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతున్నారని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
ఎవరి ప్రోగ్రామ్కు ఆటంకం కల్గకుండా కేబినెట్ సమావేశాలు
ఇక నుంచి ప్రతినెలా 2 సార్లు షెడ్యూల్ ప్రకారం కేబినెట్ భేటీ కానున్నది. తర్వాతి మంత్రివర్గ భేటీ ఎప్పుడు ఉంటుందనేది ముందే షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఎజెండాలు ప్రిపేర్ అవుతాయి. దీంతో మంత్రులు కూడా తమ షెడ్యూల్ను ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పటి దాకా టైమ్, సందర్భం, వెసులుబాటును బట్టి కేబినెట్ సమావేశాలు నిర్వహించారు.
కానీ.. ఇక నుంచి షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. జులై 10న జరిగే కేబినెట్ భేటీలో.. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్ల ఖరారు, రాజీవ్ యువ వికాసం స్కీమ్, బనకచర్ల అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.