- ఫోర్త్ క్లాసు విద్యార్థుల కోసం ఎంట్రన్స్ మెటీరియల్ పంపిణీ
హైదరాబాద్, వెలుగు: సర్కారు గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎక్కువ సీట్లు పొందేలా ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. దీంట్లో భాగంగా సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్పెషల్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో, సర్కారు స్కూల్ విద్యార్థులకు న్యాయం జరిగేలా ఎస్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకాలను రూపొందించింది.
‘సాధన గురుకుల ప్రవేశ పరీక్ష ఐటెమ్ బ్యాంక్’ పేరుతో తయారు చేసిన ఈ పుస్తకాలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని స్కూళ్లకు ఇటీవల అందించింది. ప్రతి స్కూల్కు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో సాధన వర్క్ బుక్స్ను అందించారు. వీటి ఆధారంగా టీచర్లు నాలుగో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకోనున్నారు. దీంతోపాటు గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్పై పిల్లలకు అవగాహన కల్పించి, ఎక్కువ మంది విద్యార్థులు సాధించేలా తర్ఫీదు ఇవ్వనున్నారు.
