
నల్గొండ అర్బన్, వెలుగు : రానున్న రెండు, మూడేండ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. మంగళవారం నల్గొండలోని తిప్పర్తి రైతు వేదిక వద్ద నాణ్యమైన విత్తనం-, రైతు నేస్తంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు.
430 మంది వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలను తయారు చేసి రాష్ట్రంలోని 11 వేల రెవెన్యూ గ్రామాల్లోని 40 వేల మంది రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలకరి ముందే ప్రారంభమైనందున కొన్ని గ్రామాల్లో నకిలీ విత్తన కంపెనీలు రైతులను మోసగించేందుకు సిద్ధమయ్యాయన్నారు.
నకిలీ విత్తనాల బెడద లేకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన రిజిస్టర్డ్ విత్తనాలనే వాడాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలోని 564 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు, నలుగురు చొప్పున సుమారు 1600 మంది రైతులకు ఇన్ ఫుట్ సీడ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగుకు అవకాశం ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు పల్లేటి రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్, శాస్త్రవేత్తలు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.